Mallu Bhatti Vikramarka: రాష్ట్ర అప్పు తీర్చాల్సింది తెలంగాణ ప్రజలే.. బీఆర్ఎస్ స్వేదపత్రంపై భట్టి విమర్శలు

ఏదో సాధించినట్లు బీఆర్‌ఎస్‌ స్వేద పత్రం అంటూ రిలీజ్‌ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 04:36 PM IST

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చాల్సింది తెలంగాణ ప్రజలే అని, ఇందుకోసం ప్రజలు చెమట చిందించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్‌ పేరిట బీఆర్‌ఎస్‌ స్వేద పత్రం రిలీజ్‌ చేయడంపై మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరిది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్‌, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

YS SHARMILA: జగనన్న పైకి బాణం.. ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల..?

మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లేముందు ఆయన బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. “ఏదో సాధించినట్లు బీఆర్‌ఎస్‌ స్వేద పత్రం అంటూ రిలీజ్‌ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి, చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. వాళ్లు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తీర్చాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాల్సిందే కదా..! ఇందులో వాళ్ళు చేసిన గొప్పతనం ఏముందని భట్టి వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలంగా పరిపాలన చేసిన బిఆర్ఎస్ అడ్డగోలుగా అప్పులు చేసి, ఆస్తులు సృష్టించామని గొప్పగా సమర్ధించుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంలో పేర్కొన్న అప్పులు వాస్తవమా..? కాదా..? తలసరి ఆదాయం పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా, ధనవంతులు సంపన్నులుగా మారారు.

TTD: టీటీడీకి ఒక్క రోజే రూ.ఐదు కోట్ల ఆదాయం.. భారీగా పెరిగిన భక్తుల రాక..

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒక సంపన్నుడికి రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక పేదవాడు 40 చదరపు గజాలలో ఇల్లును నిర్మించుకున్నాడు. వీరిద్దరి తలసరి ఆదాయం ఒకే విధంగా పెంచామని చెప్పడం సమంజసం కాదు. పది సంవత్సరాల కాలంలో అప్పులు చేసిన బిఆర్ఎస్ ఆస్తులను సృష్టిస్తే మరి కండ్లకు కనిపించాలి కదా! రాష్ట్రంలో ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? కొత్తగా సర్వీసు సెక్టార్ ఏర్పాటు చేశారా? కోల్డ్ ఇండస్ట్రియల్ ఏమైనా నెలకొల్పారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా తెచ్చారా? గత ప్రభుత్వాలు నాగార్జునసాగర్, జూరాల, శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, దేవాదుల, కడెం, కోయిల సాగర్ ప్రాజెక్టులను నిర్మించాయి. బిహెచ్ఎల్, ఈసీఐఎల్, బీడీఎల్ లాంటి పరిశ్రమలు నెలకొల్పడానికి కావాల్సిన భూమి, కరెంటు, నీళ్లు తదితర సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఏర్పాటుకు దోహదపడ్డాయి.

బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిందని ఏడు లక్షల కోట్లు రూపాయలు అప్పు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావాల్సిన హామీలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన బకాయిల గురించి ప్రధాని మోడిని కలుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పురోగతిపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి నిధులను రాబడతాం” అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.