South Africa Team: పాక్‌ను ఓడించి.. జై హనుమాన్‌ అంటూ.. సౌతాఫ్రికా ప్లేయర్ పోస్ట్‌కు ఫిదా

వాల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ చిత్తయింది. టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 03:30 PM IST

వాల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ చిత్తయింది. టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్థాన్ 270 పరుగుల లక్ష్యం నిర్దేశించగా.. దక్షిణాఫ్రికా సులభంగానే గెలుపు సాధిస్తుందని అనుకున్నారు అంతా ! ఐతే ఓపెనర్లు విఫలం కావడం, మిడిలార్డర్ కూడా ఆశలు వమ్ము చేయడంతో.. పాక్ వైపు మ్యాచ్‌ మొగ్గింది అనిపించింది ఓ స్టేజీలో ! ఐతే అనూహ్యంగా దక్షిణాఫ్రికాయే చివరికి విజయం సాధించింది. చేతిలో ఓవర్లు మిగిలి ఉన్నా.. రన్‌రేట్ తక్కువ ఉన్నా.. సౌతాఫ్రికా చేతిలో వికెట్లు లేకపోవడంతో.. ఓ దశలో మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా సాగింది.

మూడు వికెట్లు చేతిలో ఉన్నప్పుడు 30 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ సమయంలో మార్క్రమ్ ఔట్ కావడం.. లుంగిడి ఎంగిడి కూడా వెంటనే వెళ్లిపోవడంతో.. చివరికి కేశవ్ మహరాజ్, షమ్సి డిఫెన్స్ ప్లే చేశారు. కేశవ్ మహరాజ్ అయితే 21 బాల్స్‌ ఎదుర్కొని 7 పరుగులే చేశాడు. ఈ ఏడు పరుగుల్లో కేశవ్ కొట్టిన బౌండరీ దక్షిణాఫ్రికాకు విజయాన్నిచ్చింది. దీంతో కేశవ్‌ గ్రౌండ్ అంతా సంబరాలు చేసుకున్నాడు. ఐతే మ్యాచ్ తర్వాత అతను చేసిన పనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కేశవ్‌ మహారాజ్‌ పెట్టిన ఒక పోస్ట్.. ఇప్పుడు హాట్‌ టాపిక్ ఆఫ్ ది సోషల్‌మీడియాగా మారింది. దేవుడిపై నమ్మకం ఉంది. కుర్రాళ్లు ఎంత చక్కని ఫలితం సాధించారు.. షమ్సి, మార్క్రమ్ ప్రదర్శన చూడ్డానికి అద్భుతంగా ఉంది. జై శ్రీ హనుమాన్ అంటూ కేశవ్‌మహారాజ్‌ పోస్ట్ చేశాడు. కేశవ్ అలా పోస్ట్ చేయడానికి కారణాలు ఉన్నాయ్. అతని మూలాలు భారత్‌లో ఉన్నాయ్. అతడి పూర్వీకులు 1874లో దక్షిణాఫ్రికాకు వలసపోయారు. అతడి తల్లిదండ్రుల పేర్లు కూడా.. ఆత్మానంద్, కాంచనమాల.