MLC KAVITHA: ఇంటి భోజనం ఇప్పించండి.. కోర్టులో కవిత పిటిషన్..

ఇంటి భోజనం తినే అవకాశం కల్పించాలని, అలాగే బెడ్, మందులు, కళ్లద్దాలు అందించాలని కవిత కోరింది. పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించాలని, మంగళసూత్రం ధరించేందుకు కూడా అనుమతివ్వాలని కవిత పిటిషన్‌లో కోరింది.

  • Written By:
  • Updated On - March 30, 2024 / 09:22 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 వరకు కవిత జుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. అయితే, జైలులో తనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సీబీఐ స్పెషల్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం విచారణ జరిగింది.

AP Volunteers: వాలంటీర్లపై కూసిన కోడ్.. పింఛన్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ

తిహార్ జైలులో కవితకు మంచి సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని ఆమె తరఫు లాయర్ కోరారు. ఇంటి భోజనం తినే అవకాశం కల్పించాలని, అలాగే బెడ్, మందులు, కళ్లద్దాలు అందించాలని కవిత కోరింది. పుస్తకాలు చదువుకునేందుకు అనుమతించాలని, మంగళసూత్రం ధరించేందుకు కూడా అనుమతివ్వాలని కవిత పిటిషన్‌లో కోరింది. ఈ సౌకర్యాలు కల్పించాలని గతంలోనే కోర్టు ఆదేశించినప్పటికీ జైలు అధికారులు వాటిని అమలు చేయడం లేదు. అందరు ఖైదీలతోపాటే సాధారణ సౌకర్యాలే కల్పించారు. ఈ అంశంపై జైలు అధికారులను కోర్టు.. స్పష్టత అడిగింది. సౌకర్యాలు కల్పించకపోవడానికి గల కారణాలు తెలపాలని అధికారులను ఆదేశించింది.

ఈ కేసు విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కవితకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారని భావించారు. కానీ, అవేమీ కల్పించలేదు. దీంతో ఈ విషయాన్ని తన భర్త అనిల్‌కు చెప్పింది కవిత. ములాఖత్‌లో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన భర్తకు ఈ విషయం చెప్పడంతో ఆయన కవిత తరఫున కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారణ జరిపింది.