Nara Brahmini: బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా ?

నారా బ్రహ్మణీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపడతారా. నిన్న ప్రెస్ మీట్ తో అర్థమైంది ఏంటి. పార్టీలో శ్రేణులు ఈమెకు స్వాగతం పలుకుతారా.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 01:43 PM IST

చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఏపీ రాజకీయాల్లోనే కాదు.. టీడీపీలోనూ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. చంద్రబాబు జైల్లో ఉండడంతో.. సైకిల్ పార్టీ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయ్. దీంతో లోకేశ్‌తో పాటు బాలకృష్ణ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ శ్రేణులు ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. స్కిల్‌ కేసులో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ వ్యవహారంలో లోకేశ్‌ పాత్ర కూడా ఉంది.. విచారిస్తామని సీఐడీ అధికారులు అంటుంటే.. లోకేశ్‌ నీకు టైమ్ దగ్గరపడింది, అరెస్ట్‌కు రెడీగా ఉండు అని వైసీపీ మంత్రులు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు.

నిజంగా అదే జరిగితే.. పార్టీని ఎవరు చూసుకుంటారు.. నందమూరి ఫ్యామిలీనా.. నారా కుటుంబమా అని చర్చ జరుగుతున్న వేళ.. ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సంకేతాలు వస్తుండడంతో.. బ్రాహ్మణి ఎంట్రీపై చర్చ మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇద్దరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన తర్వాత.. బ్రాహ్మణి మాట్లాడిన మాటలు.. ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయ్. ఫస్ట్ టైమ్.. బ్రాహ్మణి రాజకీయాల గురించి మాట్లాడారు. ఆమె వాక్‌ చాతుర్యం.. పార్టీ శ్రేణుల్లో నమ్మకం ఏర్పడింది.

ఆ మాటలపై.. టైమ్ తీసుకొని మరీ మంత్రి రోజా రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు.. బ్రాహ్మణి ఎంత స్ట్రాంగ్‌గా మాట్లాడారో ! లోకేశ్‌ అరెస్ట్ అయినా సరే.. బాధ్యతలు స్వీకరించి బ్రాహ్మణి పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లగలరు అనే భరోసా నేతల్లో కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు లోకేష్‌ను అరెస్ట్ చేసి.. దీర్ఘకాలం రిమాండ్‌లో ఉంచాలని వైసీపీ సర్కార్‌ వ్యూహాలు రచిస్తున్నట్లుగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బ్రాహ్మణి సారధ్యంలోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటివరకు చంద్రబాబు కుటుంబంలో మహిళలు రాజకీయాల గురించి మాట్లాడలేదు. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు.. టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. లోకేశ్ అరెస్ట్ అయితే.. బ్రాహ్మణి వెంటనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.