CONGRESS: నిరుద్యోగులపై కేటీఆర్‌ది కపట ప్రేమ.. ఓట్ల కోసమే కేటీఆర్ ప్రయత్నం: ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్

కేటీఆర్ ఐటీ హబ్‌కు విద్యార్థులను పిలిపించి అంతా బాగుందని చూపే ప్రయత్నం చేసిండు. కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే సన్నాసులు అని వ్యాఖ్యలు చేసిండు. నిరుద్యోగుల తిరుగుబాటుకు కేటీఆర్, కేసీఆర్ భయపడుతుండ్రు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 03:59 PM IST

CONGRESS: నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చూసిన కేసీఆర్, కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు ఎన్ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “కేటీఆర్ ఐటీ హబ్‌కు విద్యార్థులను పిలిపించి అంతా బాగుందని చూపే ప్రయత్నం చేసిండు. కేటీఆర్‌కు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే సన్నాసులు అని వ్యాఖ్యలు చేసిండు.

REVANTH REDDY: శ్రీరాం సాగర్ చూపించి ఓట్లడుగుతాం.. కాళేశ్వరం చూపించి ఓట్లడుగుతావా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్..

నిరుద్యోగుల తిరుగుబాటుకు కేటీఆర్, కేసీఆర్ భయపడుతుండ్రు. 15 పేపర్లు లీక్ చేశారు. నిరుద్యోగులను రోడ్డున పడేశారు. నిరుద్యోగులు కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఓట్లేస్తారని భయపడి నిరుద్యోగులపై కేటీఆర్ కపట ప్రేమ చూపిస్తుండు. నిరుద్యోగులు చనిపోతే కనీసం భరోసా ఇవ్వలేదు. నిరుద్యోగుల పక్షాన అనునిత్యం ఎన్ఎస్‌యుఐ పోరాడింది. అండగా వుంది. నిరుద్యోగులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి. నయవంచన చేసిన నాటి ప్రభుత్వంపై నిరుద్యోగుల పక్షాన ఏ విధంగానైతే పోరాడామో ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను దగ్గరుండి అమలు చేయిస్తాం” అని బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మరో నిరుద్యోగి సాయి మాట్లాడుతూ.. “పేపర్లు లీక్ చేసి లక్షలాదిమంది విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలో పడేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. కష్టాల్లో ఉన్నప్పుడు విద్యార్థుల వెంట ఉండి నిరుద్యోగులకు భరోసా కల్పించేలా మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌ను గెలిపించాలి” అని కోరారు.

మరో నిరుద్యోగి క్రాంతి మాట్లాడుతూ.. “నిరుద్యోగులను పిలిపించుకొని మాట్లాడిన కేటీఆర్ పేపర్లు లీకైనప్పుడు ఎక్కడా కనిపించలేదు. రోడ్డున పడ్డ విద్యార్థులకు భరోసా కల్పించలేదు. ఓట్ల కోసం నిరుద్యోగులను మోసం చేసేందుకు కేసీఆర్ కేటీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులు ఆలోచించాలి” అన్నారు.