BRS leaders entry not easy : BRS లీడర్లపై వ్యతిరేకత…. పార్టీలో చేరికపై కాంగ్రెస్ నేతల అడ్డగింత !!

తెలంగాణలో గులాబీ పార్టీ లీడర్లను కాంగ్రెస్ (Congress) లో చేర్చుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి ఎక్కువ మంది BRS లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

తెలంగాణలో గులాబీ పార్టీ లీడర్లను కాంగ్రెస్ (Congress) లో చేర్చుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల నాటికి ఎక్కువ మంది BRS లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన తలుపులు తెరిచామని ప్రకటించి నెల రోజులవుతున్నా… అనుకున్న స్థాయిలో BRS నుంచి చేరికలు ఉండటం లేదు.

ఇప్పటి వరకూ నలుగురైదుగురు BRS లీడర్లు …పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy), దానం నాగేందర్, కేకే (KK), కడియం శ్రీహరి(Kadiam Srihari), రంజిత్ రెడ్డి తప్ప మిగతా నేతలెవరూ కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు. ఇంకా BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు కూడా హస్తం పార్టీలోకి వస్తారని అనుకున్నారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి BRS లీడర్లపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవద్దని నిర్మల్ జిల్లాలో స్థానిక హస్తం పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రకరణ్ ఈ పదేళ్ళలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధించారనీ… అలాంటి వ్యక్తిని తీసుకోవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జ్ మినిస్టర్ సీతక్కకు విజ్ఞప్తి చేశారు. ఐకే రెడ్డి రాకను నిర్మల్ కాంగ్రెస్ నేత కే.శ్రీహరి రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జి కూడా వ్యతిరేకించారు. ఐకే రెడ్డితో విభేదాలతో గత ఏడాదిలో శ్రీహరిరావు BRS నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. దాంతో ప్రస్తుతానికి ఐకే రెడ్డి ఇంకా కారు దిగలేదు.

గ్రేటర్ హైదరాబాద్ లో BRSకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని పెద్ద లీడర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంతో ఆయన విరమించుకున్నట్టు తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ MLA కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య చేరికను స్థానిక హస్తం పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఘన్ పూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ సింగపురం ఇందిర వర్గీయులు కావ్యను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అక్కడి కాంగ్రెస్ రెండు గ్రూపులోగా విడిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి చేవెళ్ళ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సునీతా మహేందర్ రెడ్డిపైనా స్థానిక కాంగ్రెస్ నేతలు కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తీసుకోకుండా ఎడా పెడా పార్టీలో చేర్చుకోవద్దని పీసీసీ, AICCపై ఒత్తిడి పెరుగుతోంది.