Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలుకు ముగ్గురు.. చంద్రబాబు తో ములాఖత్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 09:47 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ఆయన్ను జైలుకు తరలించారు. చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కానున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కల్యాణ్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్‌లో ఉంటారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ములాఖత్‌ తర్వాత పవన్‌ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్‌ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది..

అయితే, చంద్రబాబు అరెస్టైన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. ఓసారి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు పవన్‌ను అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రకారాగారంలో ములాఖత్‌కు అనుమతి లభించింది. ములాఖత్‌కు సుమారు 40 నిమిషాలు పర్మిన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ములాఖత్ పూర్తయి బయటికి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు మీడియాతో మాట్లాడే ఛాన్స్‌ ఉంది.

ఇటీవల రాజకీయంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జనసేన ప్రధాన కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన పవన్.. వైసీపీపై తాను పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు ..బాబు అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయగా.. జనసేన మద్దతిచ్చింది. లోకేష్‌కు ఫోన్ చేసి ముందుగానే సంఘిభావం తెలిపారు పవన్‌. అదే సమయంలో.. లోకేష్ కూడా పవన్ కల్యాణ్ అన్నలాగా అండగా ఉన్నారని.. తాను ఒంటరి వాడిని కాదని చెప్పారు.

ఈ పరిణామాలన్నింటితో టీడీపీ, జనసేన మధ్య బంధం మరింత ధృడపరిచేలా చేసిందని అంటున్నారు. నిజానికి ఈ రెండు పార్టీలు ఇంకా అధికారికంగా పొత్తులు ప్రకటించలేదు. అయినప్పటికీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. ఏదిఏమైనప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.