PAWAN KALYAN: జనంలోకి జనసేనాని.. వారాహి యాత్ర షెడ్యూల్ విడుదల

పవన్.. తను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఈ యాత్ర ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పవన్ మొదటి విడత ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు మొదటి విడత పవన్ ప్రచారం నిర్వహిస్తారు.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 07:41 PM IST

PAWAN KALYAN: ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో జగన్, ప్రజాగళం పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంతొచ్చింది. పవన్ కూడా శనివారం నుంచి వారాహి విజయ భేరి పేరిట పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్.. తను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఈ యాత్ర ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పవన్ మొదటి విడత ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు మొదటి విడత పవన్ ప్రచారం నిర్వహిస్తారు.

YASH: యష్ ఒక్కడే.. ఒంటరిగా.. పాపం పాన్ ఇండియా హీరో..

ఈ ప్రచారంలో పిఠాపురం నియోజకవర్గానికే ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. పైగా పవన్‌ను ఓడించేందుకు జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిఠాపురానికి పవన్ ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. తొలి విడతలోనే పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇక్కడే ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో పవన్ ప్రచారం చేస్తారు. అనంతరం మిగతా నియోజకవర్గాలకు వెళ్తారు.

మధ్యలో ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేస్తారు. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైనే పవన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తన పార్టీ నేతల్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున ఇతర నియోజకవర్గాల్లో కూడా పవన్ ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో పవన్ క్యాంపెయిన్ చేయనున్నారు.

పవన్ ప్రచార షెడ్యూల్ ఇది.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – యలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
ఏప్రిల్ 10 – రాజోలు
ఏప్రిల్ 11 – పి.గన్నవరం
ఏప్రిల్ 12 – రాజా నగరం