Sunitha: అరెస్ట్ చేస్తే ఉరి వేసుకుంటా.. ఎవరినీ మర్చిపోను సునీతమ్మ ఉగ్రరూపం

చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయ్. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ.. వైసీపీ, జగన్‌ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 12:23 PM IST

చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయ్. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ.. వైసీపీ, జగన్‌ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. కొందరు ర్యాలీలు నిర్వహిస్తుంటే.. మరికొందరు ధర్నాలు, రాస్తారోకోలు, ఇంకొందరు దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం పరిధిలోని పాపంపేటలో సునీత ఆమరణ నిరసన దీక్షకు దిగారు. ఐతే దీక్ష శిబిరం దగ్గరకు చేరుకున్న పోలీసులు.. సునీతను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తే ఉరి వేసుకుంటానంటూ సునీత కండువాను మెడకు చుట్టుకున్నారు. వారించిన పోలీసులు ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తీరుపై పరిటాల సునీతతో పాటు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని సునీత ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తాము ఆమరణ నిరహార దీక్ష చేపడితే.. జనాలు వస్తారనే భయంతో అతి దారుణంగా శిబిరంపై పడి దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారని.. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. పైన ఉన్న నాయకుల ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కూడా ఆలోచించాలని.. ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని.. చంద్రబాబును, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టినవారిని మర్చిపోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సునీతమ్మ. రాష్ట్రంలోని అందరి గురించే తాము పోరాటం చేస్తున్నామని.. అందుకే చంద్రబాబును జైలులో పెట్టారని విమర్శించారు. సైకో సీఎం ఏది చెబితే పోలీసులు అది చేయడం సరికాదన్న సునీత.. పోలీసులు వారి డ్యూటీ సరిగా చేయాలని కోరారు.