AP Political Party’s: కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు..?

ఏ రాష్ట్రంలో లేని చిత్రమైన రాజకీయ పరిస్థితి.. మీరు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నారు. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ.. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేని పార్టీ.. భాగస్వామ్య పార్టీ.. అన్ని పార్టీలు.. బీజేపీకే సలాం అంటున్నాయ్.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 07:39 AM IST

ఏ రాష్ట్రంలో లేని చిత్రమైన రాజకీయ పరిస్థితి.. మీరు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నారు. అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ.. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేని పార్టీ.. భాగస్వామ్య పార్టీ.. అన్ని పార్టీలు.. బీజేపీకే సలాం అంటున్నాయ్. కచ్చితంగా చెప్పాలంటే దాసోహం అంటున్నాయ్.. ఆంధ్రప్రదేశ్‌లో 25ఎంపీ సీట్లుంటే.. ఆ 25 సీట్లు ఒక్క సీటు కూడా గెలవకుండా.. తన సొంతం చేసుకుంది.. యూపీ లాంటి బలమైన రాష్ట్రంలో కూడా.. మొత్తం సీట్లు బీజేపీకి ఉంటాయో లేదో తెలీదు. కానీ.. ఏపీలో మాత్రం.. మొత్తం ఎంపీ సీట్లన్ని గెలవకుండానే బీజేపీ కైవసం అయిపోతున్నాయ్. అది ఈ రాష్ట్రంలో ఉన్న విచిత్రమైన రాజకీయ పరిస్థితి. బీజేపీ పేరు చెబితే వైసీపీ టీడీపీ జనసేన వణికిపోతున్నాయ్.

రాష్ట్రంలో పొద్దున లేస్తే చాలు.. వైసీపీ, టీడీపీ, వైసీపీ-జనసేన సిగపట్లు పడుతుంటాయ్. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు.. కుటుంబ చరిత్రలు, వ్యక్తిగత చరిత్రలు తవ్వుకుంటూ ఉంటారు..కానీ కేంద్రంలోని బీజేపీ విషయానికి వచ్చినపుడు ఈ ముగ్గురు బీజేపీకే చేయెత్తి జైకొడతారు. అదేం చిత్రమో అర్థం కాదు.. వేరే చోట్ల అయితే ఏదో ఒక పార్టీ బీజేపీతో ఉండటం సహజంగా జరిగేది. కానీ ఇక్కడ ప్రతిపక్షం, పాలక పక్షం భాగస్వామ్య పక్షం.. అందరూ బీజేపీ వాళ్లే.. అసలు బీజేపీ అడగకుండానే.. ముందే వెళ్లి ఆ పార్టీకి జైకొట్టేస్తుంటారు.. లోక్‌సభలో ఏ బిల్లు పెట్టినా.. వైసీపీ, టీడీపీ తమ మద్దతు ప్రకటించేస్తాయ్..పార్టీని, బీజేపీని ఏపీలో ఏ ఒక్క పార్టీ కూడా విమర్శించదు. పైగా చాలా గురుభక్తికితో ఉంటాయ్..ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఆనాడు అధికారంలో ఉన్న సోనియా గాంధీని వ్యతిరేకించాడు. ఆ తర్వాత ఎదురెళ్లి ఢీ కొట్టాడు. 16 నెలలు జైలులో ఉన్నాడు.. ఎంత జరిగినా కాంగ్రెస్‌కు తలొగ్గలేదు. అలాంటి జగన్మోహన్‌రెడ్డి ఇపుడు బీజేపీ జీ హుజురు అంటున్నాడు. ఢిల్లీ కబురు పెడితే రెక్కలు కట్టుకొని వాలిపోతాడు. గడిచినా నాలుగేళ్లలో లోక్‌సభలో ప్రతి బిల్లుకి అడగకుండానే వైసీపీ కేంద్రానికి మద్దతు పలికింది. ఆ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టింది వైసీపీ. ఆనాడు యూపీఏకు ఎదురొడ్డి పోరాటం చేసింది జగన్మోహన్‌రెడ్డేనా అని అనిపిస్తోంది. కేంద్రం ఏ కోరిక కోరినా.. ఆ కోరిక తీర్చేయడమే జగన్‌ పని.

ఇక చంద్రబాబు నాయుడు 45 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయంగా ఎన్నో సంక్షోభాలు, ఎదుర్కొన్నారు. అలాంటి చంద్రబాడు నాయుడు కూడా.. బీజేపీకి దాసోహం అయిపోయాడు.. ఢిల్లీ నుంచి ఆ పార్టీ కుర్చోమంటే కూర్చోవడం.. నిలబడమంటే నిలబడటం.. చేస్తున్నాడు. అంతటి రాజకీయ దురంధరుడు కూడా బీజేపీ పేరు చెబితే వణికిపోతున్నాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకతే అజెండా.. ముందుకెళ్లిన చంద్రబాబు..ఓటమి తర్వాత రూటు మార్చాడు. నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతపెద్ద రైతు ఉద్యమం జరిగినా.. కుక్కిన పేనులా ఉన్నాడు. నిన్న మొన్నటి మణిపుర్‌ ఇష్యూలోనూ నోరు మెదపలేదు.. పెట్రోలు రేటు మండిపోతే కేంద్రాన్ని ఒక్క మాట అనలేదు,. చాలా సందర్బాల్లో మోడీ, అమిత్‌ షా కేంద్రాన్ని ప్రశంసిస్తున్నాడు.. మరీ ఏ బలహీనత ఆయన్ను.. నోరు లేవకుండా చేస్తోందో మరి.

ఇక పవన్‌ కళ్యాణ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉన్న వ్యక్తి. పిలిస్తే ఢిల్లీ వెళ్లి.. వినయంగా నమస్కరించి వారు చెప్పింది విని తిరిగి రావడమే. నాలుగేళ్లలో ఎన్నడూ కేంద్రానికి వ్యతిరేకంగా నోరు విప్పలేదు. కేంద్రం విధానాలు, బీజేపీ విధానాల మీద కానీ.. రైతులకు సంబంధించిన బిల్లులపైగానీ పవన్‌ కల్యాణ్‌ ఎన్నడూ మాట్లాడలేదు. మోడీ వైఫల్యాల గురించి అసలెపుడు మాట్లాడలేదు. మరీ ఈయన బలహీనత ఏంటో అర్థం కాదు. ఈ ముగ్గురు ఏపీ నాయకులతో పోల్చుకుంటే కొద్దో గొప్పో కేసీఆర్‌ బెటర్‌… బీజేపీని బహిరంగంగానే విమర్శిస్తాడు. ఆ పార్టీ విధానాలను ఎంతో కొంత తప్పు పడుతుంటాడు. కేంద్రంతో యుద్ధం చేస్తూనే.. రాష్ట్రంలో తన పనులను చక్కబెట్టుకుంటాడు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రమూ ఎదుర్కోవడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ తప్పా.. ఇలాంటి రాజకీయ మరే రాష్ట్రంలో కూడా లేదు.