BRS Party:బీఆర్ఎస్ లో పల్లాకు జనగామా టికెట్ కన్ఫామా..? మరి పొన్నాల పరిస్థితి ఏంటి..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.

  • Written By:
  • Publish Date - October 14, 2023 / 03:43 PM IST

Telangana Assembly Elections: 2023 ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి తెలంగాణలో నేతలంతా తెగ హడావుడి చేస్తున్నారు. కొందరు టికెట్ కన్ఫాం అవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారు. మరికొందరు బుజ్జగింపులతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి మొదలైంది. అదే సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం. దీనిని గమనించిన బీఆర్ఎస్ తమ పార్టీలోకి సాదనంగా ఆహ్వానం పలికేందరుకు కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ లోని పొన్నాల నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ కి పొన్నాల మర్యాదలతో స్వాగతం పలికారు. తదనంతరం సుదీర్ఘ చర్చలు జరగిగాయి. కేటీఆర్ తో పాటూ మరి కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొనడంతో ఆయన ఇంటివద్ద సందడి వాతావరణం నెలకొంది.

పొన్నాల రాజీనామాకు కారణాలు..

పొన్నాల లక్ష్మయ్యకు దాదాపు 45ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తాజాగా కాంగ్రెస్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ కోరారు. దీనికి వాళ్లు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ జనగామ డీసీసీ అధ్యక్షుడుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించారు ఈయన. అందులో భాగంగానే ఈయనకు భవిష్యత్తులో జనగామ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారో లేదో అన్న వాతావరణాన్ని సృష్టించారు. ఇలాంటి అనేక సంకేతాల నడుమ ఆయన కాంగ్రెస్ కి స్వస్థి పలికారు. ఇంతేకాకుండా తన నిర్ణయాలకు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడా విలువ ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేశారంటున్నారు పొన్నాల వర్గం. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా చూపుతోంది. ఈయన పార్టీ వీడిన మరుక్షణంలో మరి కొందరు నాయకులు తమకు ఆశించిన టికెట్ రాదని భావించి కాంగ్రెస్ కి రాజీనామా ఇచ్చి లక్ష్మయ్య బాటలో నడిచేందుకు క్యూ కట్టారు. అయితే కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు దీనికి కొంత వరకూ డ్యామేజ్ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈయన రాజకీయ అనుభవం..

పొన్నాల లక్ష్మయ్య ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఎదిగారు. నాలుగున్నర దశాబ్ధాల పాటూ తన రాజకీయ ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో నలుగురు ముఖ్యమంత్రులతో పనిచేశారు. ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్లోనూ మంత్రిగా కీలక శాఖలలో బాధ్యతలు నిర్వహించారు. నేదురమల్లి జనార్థన్ రెడ్డి, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోణెజెటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మంత్రిగా కొనసాగారు. తెలంగాణ వేర్పడ్డ తరువాత మొట్టమొదటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా 2014 అక్టోబర్ 10 నుంచి బాధ్యతలు చేపట్టారు. 12 సంవత్సరాల పాటూ రాష్ట్రమంత్రిగా కొనసాగారు. జనగామ నుంచి ఏడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుస విజయాలను సాధించారు. ఇలాటి నాయకుడిని కాంగ్రెస్ తన తప్పిదం వల్ల కోల్పోవడం రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ క్రమంలో అక్టోబర్ 16న జరిగే జనగామ భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?

జనగామ వేదికగా బీఆర్ఎస్ లో జరుగుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వెనుక బీఆర్ఎస్ భారీ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో ముత్తి రెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి పల్లాకు టికెట్ కన్ఫాం చేసింది. ఈ నేపధ్యంలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల రాకతో రాజకీయం ఏమైనా మారే అవకాశం ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పల్లాను కాదని పొన్నాలకు టికెట్ ఇస్తారా లేక నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా నియమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అనుభవం రిత్యా పొన్నాలకు టికెట్ కేటాయించే అవకాశం ఉందంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు. అయితే ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించినందున నియోజకవర్గ గెలుపుకు కృషి చేసేలా సహకరించమని కోరే అవకాశం ఉందంటున్నారు మరికొందరు నేతలు. అయితే బీఆర్ఎస్ గెలిచిన తరువాత పొన్నాల స్థాయికి తగ్గట్టుగా క్యాబినెట్ హోదాను కల్పిస్తూ మంచి పదవిని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక నామినేషన్ వేసే సమయానికి, పోలింగ్ జరిగేటప్పటికి ఎన్ని రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయో అని చర్చించుకుంటున్నారు పరిశీలకులు.

T.V.SRIKAR