Priyanka Gandhi Vadra: బీఆర్‌ఎస్‌‌ను చూసేది మ్యూజియంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. మానవత్వంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కోరుకుంది ప్రజల తెలంగాణ మాత్రమే. ఫాం హౌజ్ తెలంగాణ కాదు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు.

  • Written By:
  • Updated On - November 24, 2023 / 06:23 PM IST

Priyanka Gandhi Vadra: తెలంగాణలో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని మ్యూజియంలోనే చూస్తారని జోస్యం చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ. తెలంగాణ ఏర్పాటులో ఎవరి భాగస్వామ్యం లేకున్నా మానవత్వంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రియాంక వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ప్రచారభేరి సభకు హాజరై ప్రసంగించారు.

Telangana Assembly: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చాం. గడిచిన పదేళ్లలో ఒక్క హైదరాబాద్ తప్ప.. తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. మానవత్వంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కోరుకుంది ప్రజల తెలంగాణ మాత్రమే. ఫాం హౌజ్ తెలంగాణ కాదు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. టీఎస్‌పీఎస్‌సీలో పేపర్లు అమ్ముకుని, అవినీతికి పాల్పడ్డారు. దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు.. నలుగురికి మాత్రమే ఉపాధి దొరికింది. రాష్ట్రంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు గుడ్ బై చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌ను మ్యూజియంలో చూస్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సమాజానికి ఉపయోగపడేలా రూపొందించాం. మా మేనిఫెస్టో.. గ్యారెంటీ కార్డు” అని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు.