Raja Gopal Reddy: పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి సైలెన్స్.. జంప్‌ చేయడం దాదాపు ఖాయమైనట్లేనా ?

ఎన్నికల వేళ.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. ఏ నేత ఎప్పుడు జంపింగ్ జపాంగ్ అంటారో.. జెండా ఎత్తేస్తారో అర్థం కాని పరిస్థితి తెలంగాణలో ! మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీలో మాత్రం గందరగోళంగా ఉంది సీన్ అంతా ! కొత్తవాళ్లు వస్తారో రారో తెలియదు.. పోనీ ఉన్నవాళ్లైనా ఉంటారా అంటే అదీ అర్థం కాదు అన్నట్లుగా తయారయింది కమలం పార్టీ పరిస్థితి.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 02:57 PM IST

ఇంటింటికి బీజేపీ అని కాషాయం పార్టీ ఓ కార్యక్రమం కండక్ట్ చేసింది. దీనికి ఇద్దరు సీనియర్‌ లీడర్లు దూరంగా ఉండడం హాట్‌టాపిక్ అవుతోంది. ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిపై ఈటలకు ఇప్పటివరకు హై కమాండ్ నుంచి హామీ లభించకపోవడంతో ఈటల అసంతృప్తిలో ఉన్నారు.

ఈటల సంగతి కాసేపు పక్కనపెడితే.. రాజగోపాల్ రెడ్డి తీరే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి వచ్చి రాజగోపాల్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం అన్న వెంకట్‌ రెడ్డి రాయబారం నడుపుతున్నారని తెలుస్తోంది. పార్టీ మార్పుపై ఇన్నాళ్లు ఖండిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి… ఇప్పుడు ఆ పని కూడా చేయడం లేదు. మౌనవ్రతం వహిస్తున్నట్లు కనిపిస్తున్నారు. తిరిగి జాయిన్ కావాలని కాంగ్రెస్‌ నుంచి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం అందింది ఇప్పటికే ! అన్న వెంకట్‌రెడ్డికి, రేవంత్‌కు మధ్య స్నేహం విరబూయడం.. ఇద్దరు దోస్త్ మేరా దోస్త్ అనుకుంటున్నారు. వచ్చెయ్ తమ్మీ అని రాజగోపాల్‌ రెడ్డితో వెంకట్‌ రెడ్డి రాయబారం కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

వీటన్నింటికి తోడు రేవంత్‌ను తిట్టి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు రాజగోపాల్ రెడ్డి. ఐతే ఇప్పుడు అదే రేవంత్‌ ఓ మెట్టు దిగుతా అంటున్నారు. మీరొస్తే చాలు అని ఆహ్వానాలు పంపుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి రాజగోపాల్ వెళ్లిపోయారనే టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి అంశంపై ఈ మధ్య వెంకట్ రెడ్డి కూడా.. ఢిల్లీలో ప్రియాంక గాంధీతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్నా లేనట్లే ఉన్నారు.. కాంగ్రెస్‌లో ఉండిపోవాలి అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజగోపాల్ నిర్ణయం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.