REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా..? కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరు: రేవంత్ రెడ్డి

మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతాం. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంస రాష్ట్రంగా మారింది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 07:08 PM IST

REVANTH REDDY: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిని పండబెట్టి తొక్కుతామని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతాం. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తాం. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ విధ్వంస రాష్ట్రంగా మారింది. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేసింది.

Malkajgiri: మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకి సూపర్ డిమాండ్.. 100 కోట్లు పెట్టే మొనగాడు ఎవరు..?

సమస్యల పరిష్కారం కోసం ప్రజా గాయకుడు గద్దర్.. ప్రగతి భవన్ వెళ్తే.. గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్‌కు గద్దర్ ఉసురు తగిలింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నేతలు శాపనార్థాలు పెడుతున్నాు. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది.. మేం రెండు నెలల్లో ఎలా చేయగలం..? మూడు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ముందా..? జన్మలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేడు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయి. ఒకటి మోడీ కూటమి. మరొకటి ఇండియా కూటమి. ఇండియా కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వం. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారు. మోదీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా..? అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాం. ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేస్తామని సమర శంఖారావాన్ని పూరించాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయింది. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీల బిడ్డలను ఆదుకుంటాం. ఆదివాసీలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించలేదు.

తన కుటుంబానికి ఉద్యోగాలు తప్ప అమరవీరులను, ఈ రాష్ట్ర యువతను కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఇప్పటికైనా ఆలోచించాలి. పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సాగునీటి ప్రాజెక్టులు కట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.