REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైంది: రేవంత్ రెడ్డి

కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాతచింతకాయ పచ్చడే. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు..? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు..? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు..?

  • Written By:
  • Updated On - November 23, 2023 / 03:49 PM IST

REVANTH REDDY: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం ఆయన దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్.. సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుడికి అలవాటైంది.

REVANTH REDDY: కొడంగల్‌లో ఆ ఓట్లే కీలకం.. రేవంత్‌‌ను విజయం వరించేనా..?

కేంద్రం నిధులు తెచ్చి రఘునందన్ రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్నారు. మూడేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకోని రఘునందన్‌కు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదు. ఈ ప్రాంతానికి రూ.10వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేది. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉన్నాడు తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసిందేం లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాతచింతకాయ పచ్చడే. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు..? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు..? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు..? ఎందుకు ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వలేదు..? పదేళ్లుగా ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదు. కేసీఆర్ గడిలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పనిచేశాడు తప్ప దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. రఘునందన్‌ను, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు. ఇక వాళ్లను చూడాల్సిందేం లేదు.

నీతికి, నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యంరెడ్డి. అలాంటి ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది. తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు. కేసీఆర్ బక్కోడు కాదు.. బకాసురుడు. ఫామ్‌హౌస్‌లో పడుకునే కుంభకర్ణుడు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం. దోచుకుంది కక్కించడం ఖాయం” అని రేవంత్ విమర్శించారు.