Sri Chaitanya Jr College: సనత్‌ నగర్‌ శ్రీచైతన్య కాలేజి ముందు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ధర్నా

ఇంటర్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీ ముందు విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. సనత్‌ నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీకి ఎస్‌ఎఫ్ఐ లీడర్స్‌ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అధికారులకు లంచం ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు విద్యార్థి సంఘ నాయకులను లోనికి పంపేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే అధికారులు కలుగజేసుకుని కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 03:15 PM IST

ఈ విషయంలో కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పే మాట వేరేగా ఉంది. అక్రమంగా ఎలాంటి క్లాసులు చెప్పడంలేదని లెక్చురర్స్‌ చెప్తున్నారు. ఓన్లీ ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ ఐన విద్యార్థులకు మాత్రమే స్పెషల్‌ క్లాసులు నిర్వహిస్తున్నామంటున్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు.

అయితే స్టూడెంట్‌ లీడర్స్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అన్ని సక్రమంగా జరిగితే తమను ఎందుకు లోనికి అనుమతించడంలేదని ప్రశ్నించారు. పోలీసులు, మీడియా, స్టూడెంట్‌ లీడర్స్‌లో ఒక్కొక్కరిని లోనికి పంపిస్తే అన్ని అనుమానాలు తీరిపోతాయన్నారు. హైదరాబాద్‌లో చాలా కాలేజీల్లో ఇదే జరుగుతోందని ఎస్‌ఎఫ్‌ఐ లీడర్‌ అశోక్‌ రెడ్డి చెప్పారు. విద్యార్థులను బలవంతం పిలిపించి క్లాసులు చెప్తున్నారని ఆరోపించారు. దీనివల్ల స్టూడెంట్స్‌ మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇలాంటి వత్తిడే కారణమన్నారు అశోక్‌.

విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ మధ్య వాగ్వాదంలో శ్రీ చైతన్య కాలేజీ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ కంట్రోల్‌ చేశారు. ఎలాంటి తప్పు జరిగిందో తాము విచారిస్తామని విద్యార్థిసంఘ నాయకులకు చెప్పారు.