Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు సహా దేశంలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ ఒకే చోట జరపాలని కోరుతూ స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 05:46 PM IST

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై గతంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. హిందూ సంఘాలు, బీజేపీ వంటి పార్టీలు స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టాయి. ఇప్పుడీ వ్యాఖ్యల్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తప్పుబట్టింది. స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు సహా దేశంలోని పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై విచారణ ఒకే చోట జరపాలని కోరుతూ స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

India vs Pakistan: ఒక్కో టిక్కెట్ ధర రూ. 1.86 కోట్లు.. అట్లుంటది భారత్ – పాక్ మ్యాచ్ క్రేజ్

ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. ‘‘వాక్‌ స్వాతంత్య్రం, మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ కింద ఉన్న హక్కులను మీరు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు స్వయంగా మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా..? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు. జరగబోయే పరిణామాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి’’ అంటూ సప్రీం ధర్మాసనం స్టాలిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్​ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణ‍యం తీసుకుంది. ఎఫ్‌ఐఆర్‌లను ఒకే చోట విచారించే అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులనే ఆశ్రయించాలని ఉదయనిధి స్టాలిన్‌ తరఫు లాయర్లకు సుప్రీం బెంచ్‌ సూచించింది.

గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీంతో ఆగ్రహించిన పలు హిందూ ధార్మిక సంఘాలు స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా పలు చోట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అనేకచోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.