Tamilisai Soundararajan: కోదండరామ్‌కు నిరాశ.. నామినేటెడ్ ఎమ్మెల్సీలపై గవర్నర్ సంచలనం..

ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండడంతో.. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిటిషన్‌ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Written By:
  • Updated On - January 17, 2024 / 08:06 PM IST

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తుండడంతో.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రిటిషన్‌ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్‌కుమార్‌, సత్యనారాయణ పేర్లను కేబినెట్‌ నామినేట్‌ చేస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది.

Ayodhya Ram Mandir: అయోధ్యకు రాముడొచ్చాడు.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా..

ఐతే ఈ ఇద్దరి పేర్లకు గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే, తమ పేర్లను ఆమోదించకపోవడంతో.. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 171 ప్రకారం.. తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్‌ చేసిందని.. గవర్నర్‌కు తిరస్కరించే హక్కు లేదని వాదించారు. ఆయా పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరంటూ.. శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆర్టికల్ 361 ప్రకారం ఈ పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరఫు కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. పిటిషన్‌ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని తెలుపుతూ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండడంతో.. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరు వెంకట్‌, మహేష్‌ గౌడ్‌కు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌.. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను నామినేట్ చేయాలని భావించింది. గవర్నర్ నిర్ణయంతో కోదండరాం పదవికి కొద్దిరోజులు బ్రేకులు తప్పేలా లేవు.