Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా వైసీపీ వేటు..?

అప్పట్లో గంటా.. స్వయంగా వెళ్లి తన రాజీనామా సమర్పించి, ఆమోదించమని కోరారు. అప్పట్లో స్పీకర్ పట్టించుకోలేదు. రాజీనామా అనంతరంగ ఆయన అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. తాజాగా స్పీకర్.. మంగళవారం గంటా రాజీనామాను ఆమోదించారు.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 07:01 PM IST

Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఆమోదిస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. దీంతో గంటా మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా.. 2019లో విశాఖ నార్త్ నుంచి, టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. గంటా రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, రాజీనామా ఆమోదించడానికి స్పీకర్ దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నారు.

YS SHARMILA: షర్మిలను నడిపిస్తోంది ఆయనేనా.. ఆమె ధైర్యం అదేనా..?

అప్పట్లో గంటా.. స్వయంగా వెళ్లి తన రాజీనామా సమర్పించి, ఆమోదించమని కోరారు. అప్పట్లో స్పీకర్ పట్టించుకోలేదు. రాజీనామా అనంతరంగ ఆయన అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. తాజాగా స్పీకర్.. మంగళవారం గంటా రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో గంటా రాజీనామా ఆమోదించడం సంచలనంగా మారింది. అయితే, ఉన్నట్లుండి గంటా రాజీనామా ఆమోదించడానికి కారణం రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటమేనని అని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గంటా ఓటు వేయడానికి వీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది. మార్చిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం ఏపీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టిక్కెట్లు నిరాకరించబోతున్నట్లు తెలిసిందే. దీంతో వాళ్లంతా టీడీపీ వైపు వెళ్తే ఒక రాజ్యసభ స్థానం టీడీపీకి దక్కే అవకాశాలున్నాయి.

అందువల్ల టీడీపీ బలం తగ్గించడానికి వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించే ముందు కనీసం ఆయనను ఒక్క సారి కూడా స్పీకర్ సంప్రదించలేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి, ఎమ్మెల్సీగా గెలిపించారు. అనంతరం వాళ్లు పార్టీకి దూరంగా ఉంటూ, టీడీపీవైపు వెళ్లారు. అందుకే రెబల్ ఎమ్మెల్యేలైన ఉండవల్లి శ్రీదేవి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి పైనా వేటు పడుతుందని భావిస్తున్నారు. అయితే, వైసీపీ వ్యూహానికి టీడీపీ కౌంటర్ సిద్దం చేస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.