CM’s camp office : సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా పైగా ప్యాలెస్‌

తెలంగాణలో(Telangana) కొత్త ప్రభుత్వం (New Government) ఏర్పడి దాదాపు నెల దాటినా.. సీఎం క్యాంప్‌ కార్యాలయం ఎక్కడా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి వద్దే ప్రజల అర్జీలు తీసుకుంటున్నారు. గతంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రస్తుతం డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు.

తెలంగాణలో(Telangana) కొత్త ప్రభుత్వం (New Government) ఏర్పడి దాదాపు నెల దాటినా.. సీఎం క్యాంప్‌ కార్యాలయం ఎక్కడా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి వద్దే ప్రజల అర్జీలు తీసుకుంటున్నారు. గతంలో సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రస్తుతం డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు చాలా భవనాలను పరిశీలించారు. చివరకు హైదరాబాద్‌లోని ఓ చారిత్రాత్మక ప్యాలెస్‌ను ఆయన కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి ‘పైగా ప్యాలస్‌’ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి.. అక్కడి నుండి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని ఆలోచిస్తున్నట్టు సామాచారం.

తెలంగాణ చీఫ్‌ సెక్రెటరీ (Telangana Chief Secretary) శాంతి కుమారి (Shanti Kumari), మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్.. సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలస్‌ను రీసెంట్‌గా సందర్శించారు. త్వరలోనే ఆ భవనాన్ని రెనోవెట్ చేసి సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చనున్నట్లు సమాచారం. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని ‘పైగా ప్యాలెస్‌’గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చారు. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్‌కు వచ్చేవారు. దాదాపు 124 సంవత్సరాల క్రితం.. రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది.

ఈ ప్యాలెస్‌కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేశారు. నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 2008 అక్టోబరు 24 నుండి హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. కాన్సులేట్ జనరల్ కోసం దీన్ని కేటాయించారు. 2023లో ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌లో కొత్తగా యూఎస్‌ కాన్సులేట్‌ భవనం నిర్మించిన తరువాత ఈ బిల్డింగ్‌ ఖాళీ అయ్యింది. దీంతో ఇది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది. 2023లో ఈ భవనాన్ని హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ తిరిగి స్వాధీనం చేసుకొని, దాని నిర్వహణను పర్యవేక్షిస్తుంది. కోర్‌ సిటీలో ఎంతో విశాలంగా ఉన్న ఈ పైగా ప్యాలెస్‌లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు యోచిస్తోంది.