Poonam Kaur: తన సామాజిక బాటలో ఎదురవుతున్న అంశాలను ప్రస్తావిస్తూ ప్రెస్ నోట్ ను విడుదల చేసిన పూనమ్ కౌర్

పూనమ్ కౌర్.. రంగు రంగుల సినిమా సినిమా ప్రపంచంలో కనిపిస్తూ.. సమాజంలో కనిపించని కనిపించని విషాదాలను వెలికితీసి సామాజిక పోరాటాలు చేస్తూ ఉంటారు. మహిళలలో చైతన్యం నింపడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఈమెపై వస్తున్న వార్తలను ఖండిస్తూ పత్రికా ముఖంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 12:39 PM IST

పూనమ్ కౌర్ ఈమె తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించారు. హైదరాబాద్ లో పుట్టి, ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నారు. ఆ తరువాత గ్రాడ్యూయేషన్ కోసం ఢిల్లీకి వెళ్లారు. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. తొలి చిత్రం ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాయాజాలంలో నటించారు. అంతేకాకుండా ఒక విచిత్రం సినిమాలో కూడా ప్రదాన పాత్ర పోషించారు. ఇది సినిమా వరకూ ఈమె ప్రస్థానం. అయితే నాణానికి మరో వైపు అన్నట్లు ఈమె తన జీవితంలో మరో కీలకమైన పాత్ర పోశిస్తున్నారు.

సామాజిక వేత్తగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల ప్రయోజనాల కోసం పాటుపడతారు. స్త్రీ హక్కుల కోసం నిరంతరం తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. అందులో ఉద్యమించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కొందరు తమ పార్టీలోకి రావాలని కోరారు. కానీ అలాంటి వాటిని నిరాకరించి ప్రజల పక్షాన నిలిచారు. ఇందులో భాగంగానే తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను, సమాజం పట్ల ఈమెకు ఉన్న ఆవేదనను లేఖ రూపంలో సందించారు. ఈ లేఖ సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం.

అందరికీ నమస్కారం.. ఇప్పటి వరకూ నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను అని నిర్మోహమాటంగా ప్రతిస్పందించారు. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తూ ఉంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావులాగా వాడాలనుకుంటన్నారని ఆరోపించారు. ఇది సముచితం కాదన్నారు. గత ఎన్నికలలో  కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకున్నారు అని ఘాటుగా స్పందించారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు, మరి కొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబానికి ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కు బిడ్డను.. మాకు త్యాగాలు తెలుసు, పోరాటాలు తెలుసని హెచ్చరించారు. నన్ను దయచేసి మీ రాజకీయాల్లోకి లాగొద్దని తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తాను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేతతో కలిసి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 15 రాష్ట్రాలు తిరిగి 21 రాజకీయ పార్టీలకు చెందిన 100కు పైగా ఎంపీలను కలిసి వారి మద్దతు తీసుకున్నామన్నారు. ఈ ప్రయాణంలో అనేక మంది సామాజిక ఉద్యమకారులను కలిసామని తెలిపారు. కొందరు మహిళా ఉద్యమనేతలతో కలిసి చర్చించినట్లు  పేర్కొన్నారు. మహిళా హక్కుల కోసం నిరంతరం తన గళాన్ని విప్పుతూనే ఉంటానని తెలిపారు. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయ స్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నట్లు వెల్లడించారు.

T.V.SRIKAR