Prices of pulses: భారత్ లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం.. ఎందుకో తెలుసా..?

మన్నటి వరకూ దేశంలో టమాటా ధరలు చుక్కలు చూపించాయి. నిన్న ఉల్లి, మిర్చి ఘాటెక్కాయి. ఇక పెట్రోలు, బంగారం పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఎప్పుడూ తగ్గుతూ.. పెరుగుతూ ఉంటాయి. అయితా తాజాగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు కెనడా - భారత్ దౌత్య సంబంధాలు తెగిపోవడమే.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 10:01 AM IST

భారతదేశపు ఆహార అలవాట్లు అన్ని దేశాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది.మన దేశంలో ప్రతిరోజూ సామాన్యుడైనా.. సంపన్నుడైనా పప్పు ధాన్యాలను వండకుండా ఉండలేడు. ఉత్తర భారతం అయినా.. దక్షిణ భారతమైనా దాల్ భోజనంలోకి తప్పనిసరి. అసలే రానున్నది పండుగల సీజన్.. వండకం వేరేమోగానీ వస్తువు మాత్రం ఒక్కటే. ఇలాంటి పరిస్థితుల్లో పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు మార్కెట్ నిపుణులు. అసలు ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ప్రదాన కారణం ఏంటి.. కేంద్ర ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ఎలాంటి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తోందో ఇప్పుడు చూద్దాం.

వీసాలు సైతం నిలిపివేత..

భారత్-కెనడా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కెనడా అధ్యక్షుడు ఖలిస్థాన్ నాయకుడి మరణంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. దీంతో ఇద్దరి దౌత్యం తెగిపోయింది. ఇప్పటికే కెనడా వెళ్లేందుకు సుముఖత చూపుతున్న భారత పౌరుల వీసాలు సైతం హోల్డ్ లో ఉంచింది ఇండియన్ ఎంబసీ. అక్కడకు వెళ్లాలనుకున్న వారు మరో గద్యంతరంలేక నిరుత్సాహానికి గురవుతున్నారు.

దిగుమతులు తగ్గుదలే అధిక ధరలకు కారణం..

ఇదిలా ఉంటే ఈ మాటల యుద్ద ప్రభావం పప్పుధాన్యాలపై కూడా ప్రభావం పడనుంది. దీనికి గల ప్రదాన కారణం కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గడం. ఇప్పటికే మన దేశంలో పప్పు దినుసుల నిల్వలు అడుగంటాయి అంటున్నారు గిడ్డంగుల పర్వవేక్షకులు. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే దీని ప్రభావం మార్కెట్ పై పడే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు. ఇదే అదునుగా పప్పు ధాన్యాలు నో స్టాక్ బోర్డులు పెట్టి.. కృత్రిమ కొరత సృష్టించి ధరలు అమాంతం పెంచే పరిస్థితులు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు దౌత్యసంబంధాలు రద్దైన పరిస్థితుల్లో వాణిజ్య ఆంక్షలు తీవ్రంగా బలపడ్డాయి. ఎగుమతులు నీరసించిన తరుణంలో పరిశ్రమలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి.

2022-23లో దిగుమతి ఎంతంటే..

భారత్ లో సాధారణంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. దేశంలో అక్కడక్కడా పండిస్తున్నప్పటికీ మనకున్న జనాభాకు అస్సలు సరిపోవు. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకుంటోంది మన దేశం. ప్రస్తుత పరిస్థితుల ప్రభావంతో మనుమటి కంటే ఆరు శాతం దిగుమతులు తగ్గినట్లు తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి పప్పు ధాన్యాలు దిగుమతి చేయడంలో కెనడా కీలక పాత్ర పోషించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకూ మనం దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలు 1.90 లక్షల టన్నులుగా లెక్కలు చెబుతున్నాయి. దీనిని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శఖ అధికారికంగా ప్రకటించింది.

ప్రత్యమ్నాయం ఏంటి..

కెనడా-భారత్ సత్సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఈ దేశం మీదే ఆధారపడకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర పావులు కదుపుతోంది. ఉన్న నిలువలు అడుగంటి పోక ముందే ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపున్నట్లు సమాచారం. దీనికోసం ఆస్ట్రేలియాతో సంప్రదింపులు చేపట్టే యోచనలో ఉంది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. మార్కెట్లో పప్పు దినుసులు పెరిగేకంటే ముందే కొరతను అధిగమించి దిగుమతిని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. సకాలంలో ప్రణాళికలు రచించి అవసరమైన స్థాయిలో పప్పుదినుసులను అందుబాటులోకి తీసుకు రావాలి. ఇలా చేస్తే ధరలు పెరిగే పరిస్థితులను నియంత్రించవచ్చు అని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు.

T.V.SRIKAR