Women On Track: ట్రాక్ పై పడిన మహిళ మీదుగా వెళ్లిన గూడ్స్ రైలు..ఆయుష్షు గట్టిదైతే ఎలాంటి ఉపద్రవాలు ఏమీ చేయలేవు..

ఆయుష్షు ఎంత గట్టిదో తెలుసుకునేందుకు కొందరు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకరు నీటిలో, మరొకరు గాలిలో వివిధ అకృత్యాలకు, విన్యాసాలకు పాల్పడుతూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అయితే మరికొన్ని బెడసికొడతాయి.అలాంటి సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది.ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

రైలు పట్టాలపై స్పృహ తప్పి పడిపోయారు ఒక మహిళ. ఆమె పై నుంచి గూడ్స్ రైలు ప్రయాణించింది. కట్ చేస్తే ఆమె ప్రాణాలతో బ్రతికే ఉన్నారు. వినడానికి చాలా విడ్డూరంగా, చూడటానికి ఆశ్చర్యంగా, నమ్మేందుకు కాస్త అనుమానంగా ఉంది కదూ. అయినప్పటికీ తప్పదు నమ్మితీరాలి. ఎందుకంటే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది కాబట్టి. ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్ గంజ్ లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాబూపూర్ గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు హరి ప్యారీ. ఈమె మందులు కొనేందుకు సహవర్ రైల్వేస్టేషన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు కళ్లు తిరిగినట్లు అనిపించింది. అకస్మాత్తుగా క్రిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అలా తల తిరిగి రైల్వే ట్రాక్ మధ్యలో పడిపోయారు.

ఈ విషయాన్ని కొందరు స్థానికులు గమనించారు. ఆమెను ట్రాక్ పైనుంచి పక్కకు తప్పించేందుకు ప్రయత్నం చేసేలోపే గూడ్స్ రైలు తన దారిపై సాఫీగా ప్రయాణం చేసేందుకు ఎంటర్ అయిపోయింది. ఇక గద్యంతరం లేక వెనకడుగు వేశారు అక్కడి ప్రజలు. ఈ లోపూ గూడ్స్ రైలు ఆమె మీదుగా వెళ్లేందుకు దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ప్యారీకి మెళుకువ వచ్చింది. కాళ్లూ, చేతులూ కదలకుండా ఉన్న స్థితిలోనే ఉండమని గట్టిగా కేకలు వేస్తూ ఆమెకు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి అలాగే రెండు నిమిషాల పాటూ ట్రాక్ పై ఉండిపోయారు. గూడ్స్ రైలు ఆమె నుంచి ముందుకు సాగి పోయిన తరువాత ట్రాక్ పై నుంచి పక్కకు తీసుకొని వచ్చారు. అయితే ఒక్క గాయం కూడా కాకుండా మహిళ ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

T.V.SRIKAR