Phone Tapping : ఆ నలుగురే చేయించారు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) వ్యవహారం త్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) వ్యవహారం త్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (DCP) రాధాకిషన్ (Radhakishen) రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్‌ పార్టీ (BRS Party) లో నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధా కిషన్ వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీకి పూర్తిస్థాయిలో రాధాకిషన్ సహాయం చేసినట్లు విచారణలో తేలింది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులను రవాణా చేసిన రాధా కిషన్.. పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను ఎమ్మెల్సీకి అందజేసినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్‌ టాస్క్‌ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్టు గుర్తించారు. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేయించారని.. డబ్బుల వ్యవహారం బయట పడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో క్లియర్‌గా మెన్షన్‌ చేశారు పోలీసులు. ఓ బిజినెస్‌ మ్యాన్‌ నుంచి డబ్బు తీసుకుని ఆ డబ్బును బొలెరో కారులో ఎమ్మెల్సీకి రాధా కిషన్ టీం అందజేసింది. డబ్బుల రవాణాలో రిటైర్డ్ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించాడు.

ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కు రాధా కిషన్ చేరవేశాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై కూడా నిఘా పెట్టారు. ప్రణీత్‌రావు (Praneet Rao) ఇచ్చే సమాచారంతో నిఘాను కట్టేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. రాధా కిషన్‌కు సహకరించిన ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లతో మాజీ పోలీసు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ తరువాత ఈ కేసుకు సంబంధించి మరిన్న కీలక విషయాలు బయటికి వచ్చే ఛాన్స్‌ ఉంది.