Global Temperatures: ఎండలు మండిపోతాయట.. ఆందోళన కలిగిస్తున్న ఐరాస నివేదిక

భవిష్యత్తులో ఎండల గురించి ఐరాస సంచలన విషయాలు వెల్లడించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఎండలు మండిపోతాయట. 2023-2027 వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు కాస్తాయని ఐరాస చెప్పింది. వరుసగా ఈ ఐదేళ్ల కాలం గతంలోకంటే ఎక్కువ ఎండలు నమోదవుతాయని ఐరాస స్పష్టం చేసింది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 06:13 PM IST

Global Temperatures: ఇప్పటికే దేశం ఎండలతో ఉడికిపోతోంది. అనేక చోట్ల 46 డిగ్రీలకుపైగా ఎండలు నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వల్ల వడదెబ్బ, ఉక్కపోత వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో వేసవిలో ఇలా ఎండలు గతంలోకంటే భారీగా నమోదవుతున్నాయి. ఈ ఎండలే ప్రపంచాన్ని భయపెడుతుంటే.. రాబోయే కాలంలో ఎండల గురించి ఐక్యారాజ్య సమితి (ఐరాస) వెల్లడించిన నివేదిక మరింత ఆందోళన కలిగిస్తోంది.
భవిష్యత్తులో ఎండల గురించి ఐరాస సంచలన విషయాలు వెల్లడించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఎండలు మండిపోతాయట. 2023-2027 వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు కాస్తాయని ఐరాస చెప్పింది. వరుసగా ఈ ఐదేళ్ల కాలం గతంలోకంటే ఎక్కువ ఎండలు నమోదవుతాయని ఐరాస స్పష్టం చేసింది. పెరుగుతున్న కర్బన ఉద్గారాలు, ఎల్ నినో కారణంగా ఎండలు పెరుగుతాయని వివరించింది. ఐరాసకు సంబంధించిన వాతావరణ పరిశోధనా సంస్థ ఈ వివరాలు తెలియజేసింది. దీని ప్రకారం.. ఇప్పటికే 2015-2022 వరకు.. వరుసగా ఎనిమిదేళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు మరో ఐదేళ్లపాటు ఈ ప్రభావం ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 1850-1900 మధ్య కాలంలో నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల టెంపరేచర్ తగ్గించేందుకు 2015లో ప్రపంచ దేశాలు అంగీకరించాయి.

దీని ప్రకారం టెంపరేచర్ తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఇవేవీ సత్ఫలితాల్నివ్వడం లేదు. గత ఏడాది 1.5 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం 66 శాతం ఉంది. ఎల్ నినో పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనివల్ల అనేక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, నీటి కొరత, ఆహార కొరత వంటివి ఎక్కువవుతాయి. ప్రపంచంలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. పర్యావరణపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. 1991-2020 వరకు ఉన్న సగటు ఉష్ణోగ్రతలకంటే ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దక్షిణ పసిఫిక్ సముద్ర సగటు ఉష్ణోగ్రత మాత్రం పెరుగుతుంది.