VIJAYASHANTHI: హస్తం గూటికి.. చెయ్యి అందుకున్న విజయశాంతి.. కాంగ్రెస్ ప్రచారంలో కీలక బాధ్యతలు

రాములమ్మకు కాంగ్రెస్ కండువా కప్పారు ఖర్గే. BRSకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేననీ.. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయడానికి తాను ఆ పార్టీలో చేరినట్టు విజయశాంతి చెప్పారు. మరి ఇంతకూ ఆమెకు కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది..?

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 06:25 PM IST

VIJAYASHANTHI: విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌కు వచ్చిన AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. రాములమ్మకు కాంగ్రెస్ కండువా కప్పారు ఖర్గే. BRSకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేననీ.. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయడానికి తాను ఆ పార్టీలో చేరినట్టు విజయశాంతి చెప్పారు. మరి ఇంతకూ ఆమెకు కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది..? మళ్లీ మెదక్ లోక్ సభ స్థానం నుంచి విజయశాంతి పోటీ చేస్తారా..? బీజేపీలో తనకు గుర్తింపు రాలేదని కొన్నాళ్ళుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న విజయశాంతి ఎట్టకేలకు హస్తం గూటికి చేరారు.

Congress Manifesto : కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకే అంకితం..

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే 1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రాములమ్మ. మొదట బీజేపీలో చేరి.. ఆ తర్వాత 2005లో తల్లి తెలంగాణ పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 2009లో బీఆర్ఎస్‌లో జాయిన్ అయి.. తన పార్టీని కూడా విలీనం చేశారు. కారు పార్టీ నుంచి మెదక్ లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. తిరిగి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు విజయశాంతి. అక్కడా ఉండలేక 2020లో మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. అప్పటి నుంచి 3యేళ్ళ పాటు కమలం పార్టీలో ఉన్న ఆమె.. చివరకు ఆ పార్టీకి కూడా ఈమధ్యే రిజైన్ చేశారు. ఇప్పటికే అసెంబ్లీ నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయి పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దాంతో విజయశాంతికి పార్టీ తరపున ప్రచారం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి నుంచి కాంగ్రెస్ ప్రచార సభల్లో ఆమె పాల్గొంటారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా ఉంటారని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని విజయశాంతి ప్రచారం చేసే అవకాశముంది.

అలాగే బీజేపీలో అవమానాలను, ఆ పార్టీ లీడర్ల అసమర్థతపైనా సభల్లో విమర్శలు చేస్తారని అనుకుంటున్నారు. ప్రచారం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ రోడ్ షోల్లో విజయశాంతి పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అంటే.. మెదక్ లోక్‌సభకు ఆమె పోటీ చేసే అవకాశముంది. కానీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అప్పటికి ఆమెకు మెదక్ సీటు ఇస్తారా లేదా అన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. 2024లో లోక్‌సభ ఎన్నికలపై ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదు. ఒకవేళ గెలిస్తే మాత్రం విజయశాంతికి ప్లస్ అవనుంది.