రేవంత్… నాగార్జునని టార్గెట్ చేయడం వెనక సీక్రెట్ ఏంటి?

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 12:30 PM IST

తెల్లవారుజాము నాలుగు గంటలకి బుల్డోజర్లు కదిలాయి. పవర్ కట్ చేశారు. మాదాపూర్ లో రోడ్లు బ్లాక్ చేశారు. సరిగ్గా ఐదు గంటలకి హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చడం మొదలుపెట్టారు. మీడియా వాళ్లు చేరుకునేటప్పటికీ ఉదయం ఏడైపోయింది. ఉదయం 10:30 కల్లా మొత్తం కన్వెన్షన్ నేలమట్టమయింది. హైడ్రా బాంబింగ్ పూర్తయింది. నాగార్జున దీన్ని అడ్డుకోవడానికి హైకోర్టులో లంచ్ పిటిషన్ మూవ్ చేశారు. స్టే రావడానికి కొన్ని గంటల ముందే హైడ్ర టీం తన పని పూర్తి చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో అధిష్టానంతోను, కేంద్ర మంత్రులతోను సమావేశంలో బిజీ బిజీగా ఉన్నారు. కానీ ఇటు హైదరాబాదులో అంతా పక్కగా ఒక పథకం ప్రకారం పని పూర్తయిపోయింది. అసలు రేవంత్ నాగార్జునని ఎందుకు టార్గెట్ చేశారు. ఎఫ్ టి ఎల్ నిబంధనలకు వ్యతిరేకంగా హైదరాబాదులో కొన్ని లక్షల ఇల్లు, ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ప్రారంభంలోనే నాగార్జునని ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనక పెద్ద కథే ఉంది.

N-కూల్చివేతకు ప్రధాన కారణం నాగార్జున కేటీఆర్ ఇద్దరు ఆప్త మిత్రులు కావడమే. నాగార్జున కోరిక మేరకే , కేటీఆర్ ఆదేశాలతో మూడేళ్ల క్రితం నాగ్ కోడలు సమంత ఫోన్ ని తెలంగాణ పోలీస్ టాప్ చేశారు అని ఆరోపణ కూడా ఉంది. ఎన్ కన్వెన్షన్ పై నాగార్జునకి ఏటా 100 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ ఉన్న మొత్తం పది ఎకరాలు భూమిని విల్లా ప్రాజెక్టుగా మార్చాలనేది నాగార్జున ప్లాన్. సిటీలో మాదాపూర్ లో ఇంత ఖరీదైన ప్రాంతంలో విల్లాలు నిర్మించడం ఒక రకంగా డేరింగ్ ప్లాన్. అందుకే ఈ ప్రాజెక్టులో కేటీఆర్ ని కూడా భాగస్వామిని చేశారు నాగార్జున. దీనికి సంబంధించిన ప్లానింగ్ వర్క్ పూర్తి కావచ్చింది . ఇదంతా ముందే సీఎం రేవంత్ కి తెలుసు. అందుకే నాగార్జుననీ కొడితే కేటీఆర్ ను కొట్టినట్లేనని ఆయన భావించాడు. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ ను అమలు చేశాడు. ఎన్ కన్వెన్షన్ విషయంలో రేవంత్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాడు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. హైడ్రా ఏర్పాటు విషయంలో మొదటినుంచి జనంలో, రాజకీయ వర్గాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. రాష్ట్రంలో పెద్ద రియాల్టర్స్ అందరితోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో హైడ్రాను సమర్థంగా అమలు చేయగలుగుతారా,? చెరువులను ఆక్రమించి కట్టిన ఇల్లన్నిటినీ కూల్చివేయడం సాధ్యమేనా? అలా కూల్చివేస్తే ఎన్ని లక్షల నిర్మాణాలను పోల్చగలుగుతారు…? ఇలా ఎన్నో అనుమానాలు జనంలో ఉన్నాయి. వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక పేరు ఉన్న వ్యక్తి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే అందరిలో నమ్మకం వస్తుందని ముఖ్యమంత్రి భావించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి, పది ఎకరాల్లో మూడు ఎకరాలు తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించారు అనేదానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే హైడ్రా పవర్ ఏమిటో రియల్ టర్లకు, సామాన్య జనానికి అందరికీ తెలియాలంటే ఒక పెద్ద సెలబ్రిటీ నిర్మాణాన్ని కూల్చివేస్తే, తేలిగ్గా జనంలోకి వెళుతుంది కనుక ఆ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే దీనిపై మరో వాదన కూడా ఉంది. నాగార్జున లాంటి పెద్దవాళ్ల నిర్మాణాన్ని కూల్చివేస్తే… మిగిలిన రియాల్టర్లు ,వ్యాపారులు పరుగులు పెడుతూ వస్తారని, అంతర్గతంగా వాళ్లతో సెటిల్ చేసు కోవచ్చనే వ్యూహంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ సర్కిల్స్లో వదంతులు నడుస్తున్నాయి. ఏది ఏమైనా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం ద్వారా కేటీఆర్ కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్లే అయింది. ఇక రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ బినామీ ఫామ్ హౌస్ లో నిర్మాణాన్ని కూల్చివేయడం కూడా ఖాయం.