YS JAGAN: మేం ఎప్పుడూ పేదల పక్షమే.. జగన్ గెలిస్తేనే పథకాల అమలు: వైఎస్ జగన్

ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. పేదల తలరాతను మార్చే ఎన్నికలు. జాబు రావాలంటే బాబు రావాలని వీరు భ్రమ కల్పిస్తారు.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 09:03 PM IST

YS JAGAN: ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. చంద్రబాబు పేదల రక్తం తాగే చంద్రముఖి అని విమర్శించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘‘మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు.

JANASENA CAMPAIGN: స్టార్‌ వ్యూహం.. హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీనుకు పవన్‌ కీలక బాధ్యతలు

జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి. చంద్రబాబు అంటేనే ఎన్నికల ముందు గంగ. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని తాగే చంద్రముఖి. వీరి మోసపు రాజకీయాలు గత 30 ఏళ్లుగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోంది. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి. ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. పేదల తలరాతను మార్చే ఎన్నికలు. జాబు రావాలంటే బాబు రావాలని వీరు భ్రమ కల్పిస్తారు. 2014కు ముందు ఇవే చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా? ఒకరికైనా మంచి జరిగిందా? జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్‌ రావాలా? మీ బిడ్డ జగన్ వచ్చాక ఏకంగా మీ గ్రామాల్లోనే సచివాలయాలు నిర్మించి అందులో లక్షా 30 వేల ఉద్యోగాలు నియామకం చేశాం. మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక ఒక్క వైద్య రంగంలోనే 54 వేల పోస్టులు భర్తీ చేశాడు.

సున్నా వడ్డీకే రుణాలిచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం. ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం. పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. చంద్రబాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. తిరగబడే సరికి వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు. అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలు భర్తీ చేశాం. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. మీ కుటుంబంలోని ప్రతి ఓటు వైఎస్ఆర్ సీపీకి వేయాలి. ప్రతి ఒకరు లోతైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి’’ అని జగన్ వ్యాఖ్యానించారు.