YS JAGAN: చంద్రబాబును నమ్మితే.. చంద్రముఖిని నిద్రలేపినట్లే: వైఎస్ జగన్

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం అయినా ఉందా..? ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీల పేరుతో మరో డ్రామాకు చంద్రబాబు తెరతీసారు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 05:45 PM IST

YS JAGAN: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని, చంద్రముఖిని నిద్ర లేపినట్టేనని విమర్శించారు ఏపీ సీఎం జగన్. ఆదివారం మధ్యాహ్నం తాడిపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కూటమిపై విమర్శలు చేశారు. “చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్ర లేపినట్టే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.

BJP-RESERVATION: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందా..? తేల్చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్..

చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం అయినా ఉందా..? ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీల పేరుతో మరో డ్రామాకు చంద్రబాబు తెరతీసారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. మోసాలు, కుట్రలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నాడు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతో మహిళలను దగా చేశాడు. రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మళ్లీ మీ బిడ్డ జగన్ ప్రభుత్వమే వస్తే.. ప్రజల జీవితాలు మరింత బాగుపడతాయి. ప్రతిపక్షాలు జెండాలు జతకట్టుకొని వస్తున్నాయి. జగన్ ఒంటరిగా ప్రజలను నమ్ముకుని వస్తున్నాడు. చంద్రబాబుకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం అలవాటే. కానీ, నేను మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తున్నా. మీ జగన్‌కు ఓటేనేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపే.

గడిచిన ఐదేళ్ల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. గతంలో ఎప్పుడూ చూడని మహిళా సాధికారతను గడిచిన ఐదేళ్లలోనే చూశాం. రైతు భరోసా కేంద్రం ద్వారా గ్రామాల్లోనే రైతులకు మేలు కలిగిస్తున్నాం. మహిళల పేరుతోనే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. 2.70 లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన సాగించాం. ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నాం. నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్ళ రూపు రేఖలను మార్చేశాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను నూతనంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. ప్రతి గ్రామం, పట్నంలో సచివాలయాలు ఏర్పాటు చేశాం. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం. 58 నెలల కాలవ్యవధిలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. మరో 15 ఏళ్లపాటు ఇలాంటి పాలన సాగితే.. ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమవుతుంది” అని జగన్ వ్యాఖ్యానించారు.