Roja defeat: వైసీపీ తొలి ఓటమి రోజాదేనా? ముందే చేతులెత్తేసిన కేడర్

నగరిలో మంత్రి రోజాకు ఫాలోయింగ్ ఎంత తగ్గిపోయిందో.. మొన్నటి అసెంబ్లీ నామినేషన్ల కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. 2014, 2019లో కనిపించిన హడావిడి ఈసారి అస్సలు కనిపించలేదు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధుల్లో కొందరు మాత్రమే హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 03:13 PM IST

Roja defeat: ఆంధ్రప్రదేశ్‌లోని నగరిలో ఈసారి మంత్రి రోజా గెలవడం కష్టమే అంటున్నారు. వైసీపీకి తొలి ఓటమి నగరి నుంచే ఉంటుందన్న టాక్ బాగా నడుస్తోంది. 2014, 2019లో ఏదో కొద్దిపాటి మెజారిటీతో ఎమ్మెల్యేగా గట్టెక్కిన రోజాకు ఈసారి 5 మండలాల్లోని సొంత పార్టీ నేతలు, కొన్ని సామాజిక వర్గాల నుంచి వ్యతిరేక వస్తోంది. ఆమె ఓడిపోతే మా బాధ్యత కాదు.. రోజాను మార్చండి అని నగరి వైసీపీ నేతలు ముందే హెచ్చరించినా అధిష్టానం పట్టించుకోలేదు.

LIGHT BEERS: తెలంగాణలో లైట్ బీర్ల కరువు.. మందుబాబు చేసిన పనికి షాక్‌..

నగరిలో మంత్రి రోజాకు ఫాలోయింగ్ ఎంత తగ్గిపోయిందో.. మొన్నటి అసెంబ్లీ నామినేషన్ల కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. 2014, 2019లో కనిపించిన హడావిడి ఈసారి అస్సలు కనిపించలేదు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధుల్లో కొందరు మాత్రమే హాజరయ్యారు. నగరి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కీలమైన నేతలు గత నాలుగేళ్ళగా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళల్లో శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, నగరిలో కెజి కుమార్ దంపతులు, నిండ్ర మండల నేత రెడ్డివారి భాస్కర రెడ్డి, పుత్తూరు మాజీ ఎంపీపీ ఏలుమలై మొదలియార్, ముఖ్యనేత రవి శేఖర రాజు, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర రెడ్డి, విజయవరం మండల నేత లక్ష్మీపతి రాజు సహా చాలామంది నేతలు ఆమెకు దూరంగా ఉన్నారు. రోజా కూడా గత నాలుగేళ్ళుగా సొంత పార్టీ నేతలను దూరం చేసుకుంటున్నారు. వారిపైనే కేసులు పెట్టించడం, పదవులు ఇస్తామని చెప్పి అవమానించడం.. వైసీపీ లీడర్లకు ఎలాంటి పనులు జరగకుండా అడ్డుకోవడం లాంటి చర్యలతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా పార్టీ వ్యవహారాల్లో రోజా భర్త సెల్వమణి తలదూర్చడాన్ని కూడా వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. వైసీపీ పెద్దలు పిలిచి మాట్లాడినా.. లోకల్ కేడర్ మాత్రం మాకు జగన్ ముద్దు.. రోజా వద్దు అంటూ తిరిగి నగరికి వచ్చేశారు.

రోజాకు ఈసారి నగరి టిక్కెట్ ఇవ్వకుండా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అసమ్మతి నేతలు. వీళ్ళల్లో ఒకరిద్దరు నేతలు టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి మంత్రి రోజా చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కొందరైతే రోజా తమ ఇంటికి వస్తుందని తెలిసి కనిపించకుండా పోతే.. మరికొందరు ఇంట్లో ఉండీ లేరని సమాధానంతో వెనక్కి పంపుతున్నట్టు సమాచారం. పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా మంత్రి పెద్దిరెడ్డి సన్నిహితులే అన్నది బహిరంగ రహస్యం. నగరిలో వైసీపీ నేతలే కాదు.. జనం నుంచి కూడా తిరుగుబాటు వస్తోంది. ప్రచారానికి వెళ్ళిన రోజా భర్త సెల్వమణిని జనం అడ్డుకుంటున్నారు. తమ కాలనీలో సమస్యలు పరిష్కరించ లేదంటూ ప్రచారానికి వెళ్ళిన ఆయన్ని నిలదీశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కొన్ని ఏరియాల్లో ప్రచారం చేయకుండానే సెల్వమణి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. పవన్, చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు, జబర్దస్త్ కామెడీ షో మీద పెట్టిన శ్రద్ధ.. నగరిలో జనం సమస్యల మీద పెడితే బాగుండేదని వైసీపీ నేతలే అంటున్నారు. ఏపీలో వైసీపీ తొలి ఓటమి నగరి నుంచే మొదలవుతుందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.