డాక్టర్‌ కేసులో ఆ ఫింగర్‌ ప్రింట్స్ ఎవరివి.. కేసులో కొత్త అనుమానాలు..

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 06:39 PM IST

కోల్‌కతా డాక్టర్‌ దారుణం వెనక.. చాలా ఘోరాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయ్. దీంతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు నిజం తేల్చేందుకు.. సీబీఐ అధికారులు లైడిటెక్టర్ పరీక్షలు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించగా.. సంచలన విషయాలు బయటకు వచ్చాయ్‌. ఘోరానికి ముందు తన బ్రోతల్ హౌస్‌కు వెళ్లింది.. అక్కడి నుంచి తిరిగి వస్తూ దారిలో ఓ మహిళను వేధించింది.. ఆ తర్వాత ఆసుపత్రిలోకి ఎలా వచ్చాడు.. ఏం చేశాడు అని అంతా వివరించినట్లు తెలుస్తోంది. ఐతే ఇదే సంజయ్ రాయ్ కోర్టు ముందు మాత్రం డ్రామాలు ఆడుతున్నాడు. అంతకుముందు సీబీఐ అధికారులు అన్ని విషయాలు ఎలాంటి సంకోచం, సిగ్గు లేకుండా పూసగుచ్చినట్లు చెప్పిన సంజయ్‌.. ఆ తర్వాత కోర్టు ముందు ప్లేట్ ఫిరాయించాడు. ఈ కేసులో తనను ఇరికించారంటూ డ్రామాలు మొదలుపెట్టాడు. దీంతో కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఐతే ఇలాంటి పరిణామాల మధ్య… మరికొన్ని విషయాలు తెరమీదకు వస్తున్నాయ్. ఈ కేసులో బాధితురాలి స్నేహితులకు కూడా లై డిటెక్టర్‌ టెస్టులు నిర్వహించేందుకు.. సీబీఐ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే డాక్టర్‌ కేసులో ఆమె నలుగురి ఫ్రెండ్స్‌ను సీబీఐ అధికారులు విచారించారు. విచారణలో వారు చెప్పిన సమాధానాలు తేడాగా ఉన్నాయని.. అందుకే లై డిటెక్టర్‌ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారని తెలుస్తోంది. లై డిటెక్టర్‌ టెస్ట్‌లో ఇద్దరు ఫస్ట్ ఇయర్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌లు ఉన్నారు. దారుణం జరిగిన రోజు రాత్రి బాధిత డాక్టర్‌, ఇద్దరు ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సెమినార్ గదికి వారు వెళ్లారు. తెల్లవారుజామున 2గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు రెస్ట్ తీసుకునే రామ్‌లోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ట్రైనీ డాక్టర్‌లో ఒకరు… బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి మృతదేహాన్ని చూశాడు. వెంటనే తన సహోద్యోగులకు, సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. ఐతే వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రదేశంలో ఆమె నలుగురి స్నేహితుల్లో ఇద్దరి వేలుముద్రలు దొరికాయ్‌. వాళ్లు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి లై డిటెక్టర్‌ చేయాలంటూ సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు.