NARA LOKESH: లోకేష్ కోసం వెతుకుతున్న సీఐడీ.. ఎక్కడున్నాడో చెప్పిన టీడీపీ.. కొనసాగుతున్న డ్రామా..!

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ కోసం అధికారులు అక్కడికి చేరుకున్నారు. తమకు లోకేష్ ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ మీడియాకు లీకులిస్తున్నారు. లోకేష్ కోసం పలుచోట్లు వెతికినట్లు చెబుతున్నారు. కావాలనే తమ నుంచి లోకేష్ తప్పించుకుంటున్నాడని అధికారులు చెబుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 04:33 PM IST

NARA LOKESH: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో నారా లోకేష్ కోసం సీఐడీ అధికారులు వెతుకుతున్నారు. ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న లోకేష్ జాడ తమకు తెలియడం లేదని సీఐడీ అధికారులు అంటుంటే.. లోకేష్ ఎక్కడున్నాడో చెప్పింది టీడీపీ. ఈ విషయంలో సీఐడీ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో లోకేష్ పేరును సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమైంది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ కోసం అధికారులు అక్కడికి చేరుకున్నారు. తమకు లోకేష్ ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ మీడియాకు లీకులిస్తున్నారు. లోకేష్ కోసం పలుచోట్లు వెతికినట్లు చెబుతున్నారు. కావాలనే తమ నుంచి లోకేష్ తప్పించుకుంటున్నాడని అధికారులు చెబుతున్నారు. తమకు దొరక్కుండా దాగుడు మూతలు ఆడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ మీడియా లీకులపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల పేరుతో సీఐడీ డ్రామాలడుతోందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోకేష్ ఎక్కడికీ పారిపోలేదేని టీడీపీ నేతలు అంటున్నారు. లోకేష్ అందుబాటులో లేడంటూ సీఐడీ లీకులివ్వడంపై సీరియస్ అవుతున్నారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నెంబర్ 50లో ఉన్న ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉండి, లోకేష్ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని టీడీపీ చెబుతోంది.

లోకేష్ ఎక్కడుంటున్నారో టీడీపీ నేతలే చెప్పేశారు. ఆయన అందరికీ అందుబాటులో ఉండి సమావేశాలు నిర్వహిస్తుంటే.. సీఐడీ మాత్రం లోకేష్ కనబడడం లేదని లీకులేంటంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఐడీ ఇస్తున్న లీకులతో లోకేష్ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందంటోన్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవసరమైతే సీఐడీ తీరుపై కోర్టుకెళ్తామని కూడా అంటున్నారు. మరోవైపు ఈ కేసుల్లో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ భావిస్తోంది. మరోవైపు వచ్చే నెల 4 వరకు లోకేష్‌ను అరెస్టు చేయకూడదని కోర్టు ఆదేశించింది.
రేపు మోత మోగిద్దాం అంటున్న టీడీపీ
చంద్రబాబును అరెస్టు చేయడంతోపాటు, లోకేష్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ కీలక ప్రకటన చేసింది. ‘నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదు అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 07:00 గంటల నుంచి 07:05 నిమిషాల వరకు.. అంటే.. ఐదు నిమిషాలపాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కి వినిపించేలా.. ఏదో ఒక రకంగా మోత మోగించండి. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’ అని ట్వీట్ చేసింది.