AP Politics: వైసీపీ పని అయిపోయిందా.. 2024కు జగన్ ఇంటికేనా ?

నాలుగు ఎమ్మెల్సీలు గెలిచినంత మాత్రాన.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా అంటే.. అవ్వొచ్చు.. అవకపోవచ్చు ! ఐతే ఒక్కటి మాత్రం నిజం.. ఈ ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల మీద ఉంటుంది. వైసీపీ ఇప్పటికైనా అప్రమత్తం కావాలి.. ఓటమిని, వైఫల్యాన్ని అంగీకరించకుండా.. ఇంకా మొండివాదన చేస్తామంటే.. 2024లో ఇంటికి వెళ్లాల్సిందే ! గుర్తులు ఉన్న ఎన్నికల్లో చూసుకుందాం అని ఒకరు అంటారు..

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 06:00 PM IST

ఈ ఎన్నికలు వేరు ఆ ఎన్నికలు వేరు అంటారు ఇంకొకరు.. ఆరు గెలిచిన మాదే విజయం అంటారు ఇంకొకరు.. ఇంత దెబ్బ తగిలినా ఇలా కవర్ చేసుకుంటూ మాటలు మాట్లాడితే లాభం లేదు.. వైసీపీ గుర్తించాల్సింది ఇదే అన్నది చాలామంది అభిప్రాయం. మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓడిపోవడం అంటే మాములు విషయం కాదు. 108 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది. 23 ఓట్లు టీడీపీకి ఎమ్మెల్సీకి రావడం అంటే.. మరో నాలుగు నియోజకవర్గాల్లో ఎఫెక్ట్. ఈ లెక్కలన్నీ వైసీపీ గమనించాలి.

ప్రతిపక్ష నేతగా 24 గంటలు జనాల్లో ఉన్న జగన్.. ఇప్పుడు అదే జనానికి దూరం అవుతున్నారు. తాడేపల్లిలో మీటింగ్ పెట్టడాలు.. ఎంతసేపు క్లీన్‌స్వీప్ అంటా బాజా మోగించడాలు.. పార్టీలో ఏం జరుగుతుంది.. పార్టీ గురించి జనం ఏమనుకుంటున్నారని కనీసం పట్టించుకోవడం లేదు జగన్ అనే అభిప్రాయాలు ఉన్నాయ్. 175 స్థానాల్లో.. దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయ్. అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయ్. అవి ముదరకముందే.. జగన్ అప్రమత్తం కావాలి.. లేదంటే అదే టీడీపీకి ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది.

అసంతృప్తులు అనేవి ఇంట్లో తిరిగే ఎలకల్లాంటివి.. కళ్ల ముందు తిరుగుతున్నా.. కర్ర పెట్టుకు కొట్టలేని పరిస్థితి. అలాంటి అసంతృప్తులపై ఇప్పుడు జగన్ నజర్ పెట్టాలి. ఎమ్మెల్సీ ఫలితాలు వార్నంగ్ బెల్‌లాంటివి. ఇప్పటికైనా జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు చేయాలి. జనాల్లో ఉండాలి. సంక్షేమమే గెలిపిస్తుందనే మాటలో ఉంటే.. 2024కు జగన్ ఇంటికి వెళ్లాల్సిందే ! యువతలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఎమ్మెల్సీ ఫలితాలతో అర్థం అయింది. ఆ యువమంత్రాన్ని అందుకునేందుకు లోకేశ్‌ అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్సీలే కదా.. టార్గెట్ ఓటర్లతో సంబంధం లేదు కదా అని లైట్ తీసుకుంటే.. వైసీపీ చెల్లించక తప్పదు భారీ మూల్యం.