Bandi Sanjay: బీజేపీతో టచ్‌లో ఉన్న ఆ 25మంది బీఆర్ఎస్‌ నేతలు ఎవరు ?

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగిన పొలిటికల్ యుద్ధం.. ఒక్కసారిగా టర్న్‌ తీసుకుంది. కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్‌ రేసులోకి వచ్చేసింది. ఇక కీలక నేతలంతా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్న వేళ.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 04:58 PM IST

Bandi Sanjay: తెలంగాణ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఆరు నెలలకు మించి సమయం లేకపోవడంతో.. పార్టీలన్నీ దూకుడు పెంచాయ్. వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయ్. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగిన పొలిటికల్ యుద్ధం.. ఒక్కసారిగా టర్న్‌ తీసుకుంది. కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్‌ రేసులోకి వచ్చేసింది. ఇక కీలక నేతలంతా హస్తం పార్టీలోకి క్యూ కడుతున్న వేళ.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

పొంగులేటి, జూపల్లిని పార్టీలోకి తీసుకురావడంలో విఫలం అయిన బీజేపీని వరుస షాక్‌లు ఇబ్బంది పెడుతున్నాయ్. ఆ ఇద్దరు వచ్చినా రాకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అనే సంకేతాలను జనాల్లోకి పంపించేందుకు.. బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా అమిత్‌ షాను తెలంగాణకు పిలిచి.. ఆ ఇద్దరికి షాక్ ఇచ్చేలా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐతే ఇప్పుడో కొత్త ప్రచారం.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మార్చింది. 25మంది బీఆర్ఎస్‌ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాన్ని వేడెక్కించాయ్. ఐతే వారెవరు, వివరాలేంటి అని అడిగితే మాత్రం.. సమాధానం చెప్పడం లేదు బండి సంజయ్. 2018 ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు.

ఆ తర్వాత రెండు బై ఎలక్షన్లలో ఇద్దరు బీజేపీ తరపున గెలిచినా, మూడోసారి బొక్కబోర్లా పడింది కమలం పార్టీ. కర్ణాటకలో కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని సర్వేలు చెప్తున్నాయ్. ఐతే బీజేపీ నేతలు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. నిజంగా 25మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారా.. అసలు వాళ్లంతా కమలం పార్టీ వైపే ఎందుకు చూస్తున్నారు అంటే.. ఏ ప్రశ్నకు సమాధానం వినిపించడం లేదు. పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్న వేళ పొలిటికల్ అటెన్షన్‌ డ్రా చేసేందుకు మాత్రమే.. బండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తప్ప.. నిజానికి కాషాయం పార్టీకి అంత సీన్ లేదు అన్నది రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.

కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో క్లియర్‌గా కనిపిస్తోందని.. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి.. బీజేపీకి రెండో స్థానం కూడా దక్కే అవకాశాలు లేవని సర్వేలు చెప్తుండడంతో.. బీజేపీ కవర్‌డ్రైవ్‌లు మొదలుపెట్టిందని.. బండి సంజయ్‌ మాటలతో అర్థం అవుతోంది అదే అనే చర్చ జరుగుతోంది.