BANDI SANJAY: తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ బండికే !

దూకుడు మీదున్న బండిని కంట్రోల్ చేయడం.. మొదటికే మోసం తీసుకువచ్చిందని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. కేవలం నామమాత్రపు మార్పులతోనే సరిపెట్టారు.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 06:56 PM IST

BANDI SANJAY: సరిగ్గా ఏడాది కింద.. బీఆర్ఎస్‌తో పోటీ అంటే బీజేపీనే అనే పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఉపఎన్నికల్లో సత్తా చాటి, ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా చేసుకొని బీజేపీ దూకుడుగా రాజకీయాలు చేసింది. ఐతే అధ్యక్షుడి మార్పుతో కమలం ఒక్కసారిగా వాడిపోయింది. అప్పటివరకూ ముక్కోణపు పోటీగా కనిపించిన తెలంగాణ రాజకీయం.. ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్‌ బీఆర్ఎస్‌గా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం అధ్యక్షుడిని మార్చడమే అన్నది చాలామంది అభిప్రాయం.

Praja Vani: ప్రజా దర్బార్ కాదు.. ప్రజా వాణి.. కొత్త రూల్స్ ఇవే..!

దూకుడు మీదున్న బండిని కంట్రోల్ చేయడం.. మొదటికే మోసం తీసుకువచ్చిందని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి.. కేవలం నామమాత్రపు మార్పులతోనే సరిపెట్టారు. బండి మార్క్ దూకుడు.. కిషన్ రెడ్డిలో కనిపించలేదు. స్వయంగా ఆయన ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా పోటీ చేయకుండా తప్పుకోవడం.. శ్రేణులకు తప్పుడు సంకేతాలు ఇచ్చింది అన్న విశేషణలు వినిపించాయ్. ఐతే ఎట్టకేలకు 8 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ.. గతంతో పోలిస్తే మాత్రం బాగానే పుంజుకుంది. ఐతే ఈ మాత్రం గెలుపు కూడా బీజేపీ సాధించింది అంటే.. అది బండి కష్టమే అని మరికొందరి వాదన. వివిధ నియోజకవర్గాల స్థాయిలో బీజేపీని ఆయన బలపరిచిన తాలూకూ ఫలితమే ఆ స్థానాలలో గెలుపు అని చాలామంది విశ్లేషించారు. తెలంగాణ ఫలితాలతో ఆలోచనలో పడిన బీజేపీ అగ్ర నాయకత్వం.. మరోసారి బండికి పగ్గాలు అప్పచెప్పాలని చూస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

తెలంగాణలో మొదటి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి మార్పు ఉంటుందని, పార్టీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన బండికే మళ్లీ పగ్గాలు అప్పగించాలని చూస్తోందని ప్రచారం నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు బండి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలన్నది.. ప్రస్తుతానికి అగ్రనాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. మరి ఇది నిజమా.. ఒకవేళ నిజమే అయితే బండి అంగీకరిస్తారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.