Yediyurappa: మళ్లీ యడ్యూరప్ప జపం చేస్తున్న బీజేపీ..!

కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప డిసైడింగ్ ఫ్యాక్టర్ అని తెలిసిన విషయమే. అలాంటి యడ్యూరప్పను సైడ్ చేసేసి ఎన్నికలకు వెళాలనుకుంది బీజేపీ హైకమాండ్. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకుంది.

  • Written By:
  • Publish Date - March 6, 2023 / 01:00 PM IST

కర్నాటకలో బీజేపీ ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు అక్కడ ఏమాత్రం అనుకూలంగా లేవని బీజేపీ గ్రహించింది. దీంతో హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యంగా కర్నాటక ఎన్నికలు అయ్యేంతవరకూ అమిత్ షా బెంగళూరులోనే మకాం వేయబోతున్నారు. అయితే ఇన్నాళ్లూ యడ్యూరప్పను పక్కన పెట్టిన బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఆయన్ను వాడుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

కర్నాటకలో యడ్యూరప్ప లేని బీజేపీని ఊహించుకోలేం. దక్షిణ భారతదేశంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత యడ్యూరప్పదే. కర్నాటకలో ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే ఆ క్రెడిట్ యడ్యూరప్పకే దక్కుతుంది. యడ్యూరప్ప లేకుండా కర్నాటకలో బీజేపీ మనుగడ సాధించడం కష్టం. అయితే కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కర్నాటకలో యడ్యూరప్పను నిర్దాక్షిణ్యంగా సీఎం పీఠం నుంచి తప్పించి ఎస్.ఆర్.బొమ్మైని కూర్చోబెట్టింది. యడ్యూరప్పకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. అయినా హైకమాండ్ మాట కాదనలేక కామ్ గా ఉండిపోయారు. అప్పటి నుంచి కర్నాటకలో యడ్యూరప్పను బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. కీలక సమావేశాలకు సైతం యడ్యూరప్పకు ఆహ్వానం అందలేదు. పార్టీని నిలబెట్టిన నేతను ఇలా అవమానాలకు గురిచేయడం యడ్యూరప్ప సన్నిహితులు జీర్ణించుకోలేకపోయారు.

ముఖ్యంగా లింగాయత్ సామాజికవర్గం యడ్యూరప్పతో బీజేపీ వ్యవహరించిన తీరుపై రగిలిపోతోంది. కర్నాటకలో లింగాయత్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇప్పటికీ 80శాతం లింగాయత్ లు యడ్యూరప్ప వెంటే ఉన్నారని నమ్ముతున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించాయి. లింగాయత్ లు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారనే విషయం బీజేపీకి అర్థమైంది. అందుకే వారని ఎలాగైనా మచ్చిక చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే వర్కవుట్ కాలేదు. ఎక్కడికెళ్లినా యడ్యూరప్ప పేరే వినిపించింది. దీంతో ఇప్పుడు మళ్లీ యడ్యూరప్పను పోస్టర్ బాయ్ గా మార్చేసింది. ఎన్నికల క్యాంపెయిన్లో యడ్యూరప్ప పేరు, ఫోటోనే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను మళ్లీ ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా ప్రధానే రంగంలోకి దిగారు. గత నెల యడ్యూరప్ప బర్త్ డే వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. ఆయన్ను కర్మయోగిగా సంబోధించారు.

కర్నాటక ఎన్నికల్లో యడ్యూరప్ప డిసైడింగ్ ఫ్యాక్టర్ అని తెలిసిన విషయమే. అలాంటి యడ్యూరప్పను సైడ్ చేసేసి ఎన్నికలకు వెళాలనుకుంది బీజేపీ హైకమాండ్. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకుంది. అయితే గ్రౌండ్ లెవల్లో సీన్ వేరేలా ఉంది. యడ్యూరప్ప లేకుండా ఎన్నికల్లో నెగ్గడం అసాధ్యమని అర్థమైంది. అందుకే ఇప్పుడు బీజేపీ హకమాండ్ మల్లీ యడ్యూరప్ప జపం చేస్తోంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యడ్యూరప్ప ఉన్నా కూడా పెద్దగా ప్రయోజనం లేదనేది సర్వేలు చెప్తున్న మాట. కర్నాటకలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కమీషన్ సర్కార్ గా పేరొందడం, విపక్షాలపై కక్ష సాధింపులు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. బీజేపీని పెద్ద సమస్యగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. దీంతో ఈసారి కర్నాటకపై బీజేపీ ఆశలు అడియాశలు కావడం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి.