AP BJP: ఏపీ బీజేపీలో మార్పులు.. వచ్చే వారమే కొత్త కార్యవర్గం.. పార్టీకి జోష్ తెచ్చేనా..?

తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయడం ద్వారా ఏపీ బీజేపీలోనూ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాల్ని అధిష్టానం పంపింది. ఏపీకి ఇటీవలే సోము వీర్రాజును తొలగించి, పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 02:11 PM IST

AP BJP: తెలంగాణలో బీజేపీ పరిస్థితి బాగానే ఉన్నా.. ఏపీలో మాత్రం ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. అందుకే ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా అధిష్టానం ప్రత్యేకదృష్టి పెట్టింది. తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయడం ద్వారా ఏపీ బీజేపీలోనూ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాల్ని అధిష్టానం పంపింది. ఏపీకి ఇటీవలే సోము వీర్రాజును తొలగించి, పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న సునీల్ ధియోధర్‌ను కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించింది. అలాగే ఏపీ నుంచి సీనియర్ లీడర్ సత్యకుమార్‌కు జాతీయ కార్యవర్గలో చోటు కల్పించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే వారంలో ఏపీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా మార్పులు చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న సునీల్ ధియోధర్‌ను ఆ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. పార్టీలో ఆయనకు మంచి ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఏపీకి సంబంధించి అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆయన విఫలమయ్యారు. పార్టీని పూర్థిస్థాయిలో పటిష్టం చేయలేకపోయారు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనను తొలగించి, మరొకరిని ఇంఛార్జిగా నియమించే అవకాశం ఉంది. పైగా సునీల్ ధియోధర్‌పై ఒక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సునీల్ మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ఆయన స్తానంలో బండి సంజయ్‌ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

బండి ఏపీ బాధ్యతలు తీసుకుంటే, వరుస కార్యక్రమాలతో పార్టీకి ఊపు తీసుకురాగలరని అధి‌ష్టానం భావిస్తోంది. దీనికి అనుగుణంగా వారం రోజుల్లో ఏపీ బీజేపీ కార్యవర్గం మారబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నారు. అప్పుల గురించి నిలదీశారు. రోడ్ల దుస్థితిపై మాట్లాడారు. దీంతో వైసీపీ నేతల నుంచి పురందేశ్వరికి కౌంటర్లు పడుతున్నాయి. గతంలోకంటే బీజేపీలో కాస్త సందడి కనిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితులు బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతాయో చూడాలి.