KCR: కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ సూపర్ ప్లాన్.. బరిలో బండి సంజయ్..?

కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఇంకా కసరత్తులు చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఒక్క అడుగు ముందే ఉండి బలమైన నేతలను బరిలో నిలిపే ప్లాన్‌లో ఉంది.

  • Written By:
  • Updated On - September 10, 2023 / 05:33 PM IST

KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఫైట్ అన్నట్లు సీన్ కనిపిస్తున్నా.. బీజేపీ కూడా అలర్ట్ అయింది. గ్రౌండ్‌ లెవల్‌లో చాకచక్యంగా వ్యూహాలు కదుపుతోంది.
తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాలని, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీనికి తగినట్లుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఐతే బీఆర్ఎస్‌ను ఓడించడానికి కంటే ముందు.. ఈసారి కేసీఆర్‌ను ఓడించాలని ప్లాన్ చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్‌ బరిలోకి దిగబోతున్నారు. కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఇంకా కసరత్తులు చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఒక్క అడుగు ముందే ఉండి బలమైన నేతలను బరిలో నిలిపే ప్లాన్‌లో ఉంది.

గజ్వేల్ నుంచి కే‌సి‌ఆర్‌కు పోటీగా.. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేయబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈటల కూడా కేసీఆర్‌పై పోటీ చేసేందుకు ఆసక్తిగా కనిపిస్తున్నారు. కే‌సి‌ఆర్‌ను ఎలాగైనా ఓడిస్తానని శపథం చేస్తున్నారు. గజ్వేల్ బరిలో నిలిచేందుకు ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌కు పోటీగా ఈటల దాదాపు ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్‌ నుంచి ఈటల బయటకు వెళ్లినప్పటికీ.. కే‌సి‌ఆర్ కానీ, కేటీఆర్‌ కానీ అప్పుడప్పుడు ఆయనపై సానుకూలంగానే స్పందిస్తూ వచ్చారు. ఒకవేళ కేసీఆర్‌కు పోటీగా ఈటల ఖరారు అయితే.. కేసీఆర్ అండ్ కో ఈటల మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్‌కు పోటీగా ధర్మపురి అరవింద్‌ను బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈటల స్థాయిలో కే‌సీఆర్‌ను ఢీ కొట్టే సత్తా అరవింద్‌కు లేదని బీజేపీలోని ఒక వర్గం భావిస్తోందట. దీంతో బండి సంజయ్‌ని బరిలో దించితే ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే కే‌సి‌ఆర్‌ను ఓడించడం అంటే అంతా తేలికైన విషయం కాదు. అయినా ఈసారి ఓడించడం ఖాయమని బీజేపీ చెప్తోంది. కుటుంబపాలన, అవినీతి అంశాలనే ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది. దీనికోసం కమలం పార్టీ పెద్దలు ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నారు.. వారి వ్యూహరచన ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.