BRS Government: బీఆర్ఎస్‌కు ప్లస్సేంటి..? మైనస్సేంటి..? తెలంగాణ జనం ఏం ఆలోచిస్తున్నారు?

కాంగ్రెస్ వేవ్ వీస్తోందన్న వార్తలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం బీఆర్ఎస్ గెలుపుపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నో పథకాలను తీసుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 08:22 PM IST

BRS Government: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్ ఈనెల 28తో ముగుస్తోంది. 30న పోలింగ్ జరగబోతోంది. కాంగ్రెస్ వేవ్ వీస్తోందన్న వార్తలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం బీఆర్ఎస్ గెలుపుపై హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. బంగారు తెలంగాణ తెచ్చామంటోంది. అయినా ఆ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందన్న నమ్మకం చాలామందిలో లేదు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాజిటివ్, నెగటివ్ అంశాలేంటి?
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గడిచిన రెండు పర్యాయాలు ఎన్నో పథకాలను అమలు చేసింది. సాగునీరు, తాగునీరు, 24గంటల కరెంట్, ఆసరా ఫించన్ల పెంపు, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు లాంటి పథకాలను ఎన్నో ప్రవేశపెట్టింది. వీటికితోడు గత ఎన్నికలతో పాటు ఈసారి కూడా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని కోరుతున్నారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పొంచి ఉంది. అసలు కేసీఆర్ సర్కార్ ముందున్న నెగిటివ్ అంశాలు ఏంటో చూద్దాం.

DELHI: రూ.350 కోసం బాలుడి దారుణ హత్య.. 60 సార్లు కత్తితో పొడిచి హత్య
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత బీఆర్ఎస్‌పై పీకల్లోతు కోపంగా ఉంది. పేపర్ లీకులు, వాయిదాల మీద వాయిదాలు, ఉద్యోగాలన్నీ భర్తీ చేయకపోవడం లాంటివి కేసీఆర్ సర్కార్‌కి మైనస్‌గా మారాయి. వృద్ధులకు రెండు వేలు, మూడు వేలు ఫించన్ ఇవ్వడం కాదు.. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కొన్ని వర్సిటీల నిరుద్యోగ యువత గ్రామాల్లో బస్సు యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యం చేస్తున్నారు. మాకు పెన్షన్ వద్దు.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే చాలు.. అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అని కోరుతోంది యువత. ఇక రైతుబంధు విషయంలో ప్రభుత్వంపై జనంలో సానుకూలత ఉంది. కానీ రుణమాఫీ విషయంలో రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రుణాల మీద వడ్డీ మాఫీ చేశారు. కానీ ఇంకా చాలా మందివి లోన్ మాఫీ కాలేదంటున్నారు. లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తే.. తమకు రైతుబంధు కంటే ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు రైతులు. దళిత బంధు పథకమైతే పార్టీ కార్యకర్తలకే దక్కాయన్న విమర్శలున్నాయి.

Priyanka Gandhi Vadra: తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. శుక్ర, శని వారాల్లో పర్యటన

కొందరు ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్ వసూలు చేశారని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి అసలైన లబ్దిదారులకు కాకుండా.. పైరవీలు చేసిన వారికే దక్కాయని జనం ఆగ్రహంగా ఉన్నారు. ఇక ఆంధ్రా సెటిలర్లు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. గతంలో బీఆర్ఎస్‌కే ఓట్లేసిన వీళ్ళు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నా పెద్దగా ఆ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు కూడా తక్కువే అంటున్నారు. ఇది కూడా బీఆర్ఎస్‌కు ఈసారి మైనస్ కానుంది. బిజెపి, బీఆర్ఎస్ ఒకటే.. అందుకే కవిత అరెస్ట్ కాలేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్‌గా కేసీఆర్, మోడీ.. ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కూడా జనం నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ముస్లిం వర్గం కూడా ఈసారి బీఆర్ఎస్‌కు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. చావు నోట్లో తలకాయ పెట్టా.. నేను లేకపోతే తెలంగాణ వచ్చేదా అని పదే పదే సభల్లో చెప్పుకుంటున్నారు సీఎం కేసీఆర్.

REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారు మయమైంది: రేవంత్ రెడ్డి

కానీ గత ఎన్నికల్లోలాగా తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే ఛాన్సే లేదు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారడం.. పదేళ్ళయినా ఇంకా ఆంధ్రా లీడర్ల మీద ఆడిపోసుకోడం తెలంగాణ జనానికి నచ్చడం లేదు. పైగా ఈమధ్య చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ టెక్కీలు ధర్నాలు చేస్తుంటే.. కేటీఆర్ చేసిన కామెంట్స్ సీమాంధ్ర ఓటర్లకు కోపం తెప్పించాయి. డ్యామేజీ జరిగిందని బీఆర్ఎస్ గుర్తించి వివరణ ఇచ్చుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగింది. ఇదే టైమ్‌లో మేడిగడ్డ పిల్లర్లు కూలిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కూడా బీఆర్ఎస్ సర్కార్‌కి మైనస్‌గా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయనీ.. కరెంట్ లేక చీకటి రోజులు వస్తాయనీ, మతకలహాలు పెరుగుతాయని సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేపట్టిన పథకాలను తెలంగాణ జనం నమ్ముతున్నారు. వీటికి తోడు కుటుంబపాలన అనే ఇష్యూ కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

తెలంగాణ సాధనలో అనేక పార్టీలు, ఉద్యోగులు, బడుగు, బలహీన వర్గాలు, పీడిత ప్రజలు.. అంతా కలసి సాధించారు. విద్యార్థులు, యువత బలిదానాలు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక బాగు పడింది మాత్రం కల్వకుంట్ల కుటుంబమే అన్న ప్రతిపక్ష నేతల ప్రచారం జనంలోకి బాగా వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చానని చెప్పుకుంటున్న బీఆర్ఎస్‌కు పదేళ్లు అధికారం ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్‌కి ఇస్తే తప్పేంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌కి పాజిటివ్స్ కంటే.. నెగిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.