Chandrababu Naidu: అంగళ్ల ఘటనలో నాపై హత్యాయత్నం.. సీబీఐ విచారణ జరిపించాలి: చంద్రబాబు

ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. నాపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారు. సైకో ముఖ్యమంత్రి అదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింది. సైకో చెప్పాడు కాబట్టే మంత్రి పెద్దిరెడ్డి, అతడి తమ్ముడు నాపై దాడికి యత్నించారు.

  • Written By:
  • Updated On - August 9, 2023 / 04:35 PM IST

Chandrababu Naidu: అంగళ్లలో తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్ఎస్‌జీ కమాండోలు, మీడియా సాక్ష్యంగా తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరంలో బుధవారం జరిగిన ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యాలు చేశారు. “అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా.

ఎక్కడికి వెళ్లినా నాపై దాడికి యత్నిస్తున్నారు. అంగళ్లలో నన్ను చంపాలనే వారు వచ్చారు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. నాపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారు. సైకో ముఖ్యమంత్రి అదేశాలతోనే నాపై హత్యాయత్నం జరిగింది. సైకో చెప్పాడు కాబట్టే మంత్రి పెద్దిరెడ్డి, అతడి తమ్ముడు నాపై దాడికి యత్నించారు. అంగళ్లకు చేరుకునేలోపే రూ.5 వేల కోట్ల స్కామ్‌ను బయట పెట్టాను. రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా మంత్రి పెద్ది రెడ్డి సుమారు రూ.3 వేల కోట్ల స్కామ్ చేశారు. వాళ్ల అక్రమాలు బయట పెట్టాను అని నన్ను చంపాలని యత్నిస్తున్నారు. దాడులు చేసి, తిరిగి నాపైనే కేసులు పెడతారా? నాతో ఎవరు వస్తే వాళ్లపై కేసులా? బెదిరించి స్టేట్మెంట్‌లు తీసుకుని కేసులు పెడుతున్నారు.

విలువలు కలిగిన అశోక్ గజపతి రాజుపై కేసులు పెట్టి వేధించారు. ఈనాడు రామోజీ రావు, ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ, టీవి 5 ఛానెల్‌పై, ఎందరో నేతలపై కేసులు పెట్టారు. చిరంజీవి మాట్లాడితే ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. పోలీసులను పార్టనర్స్‌ను చేసి, వారి అరాచకాలకు పోలీసులను వినియోగిస్తున్నారు. రాత్రి నేను వస్తుండగా కోరుకొండలో విద్యుత్ కోతలు విధించారు. మాకు పోలీస్‌లు ప్రత్యర్ధులు కాదు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నేను రాజకీయంగా మాట్లాడితే నాపై దాడి చేసి, హత్య చేస్తారా? నా ప్రోగ్రామ్‌కి వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇన్ని కేసులు పెట్టినా నేను ఎన్నడూ భయపడలేదు. అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణ జరగాల్సిందే. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే, వాడినైనా కొట్టుకుంటాడు. లేదా మనల్ని కొడతాడు.

ఈ రాష్ట్రంలో అదే జరుగుతోంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం. సీబీఐ విచారణ జరిగే వరకు వదిలిపెట్టం. లీగల్‌గా, పొలిటికల్‌గా ఫైట్ చేస్తాం. ప్రజా క్షేత్రంలో వారిని దోషులుగా నిలబెడతాం. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను చూశాం. ఎన్ని ట్విస్ట్‌లు చెప్పారు? కోడి కత్తి కేసులో ఎన్ఐఏను తప్పు బట్టించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వైసీపీ నేతలు పారిపోవాల్సిందే” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.