Chandrababu Naidu: చంద్రబాబుకు అనారోగ్యం.. అత్యవసరంగా వైద్యులు కావాలంటూ లేఖ..

అత్యవసరంగా వైద్యుల్ని పంపించాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన జీజీహెచ్ వైద్యాధికారులు.. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు కేటాయించారు. అధికారుల ఆదేశం మేరకు గురువారం సాయంత్రం వైద్యులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 07:12 PM IST

Chandrababu Naidu: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒకసారి అస్వస్థతకు గురైన చంద్రబాబు గురువారం మరోసారి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అధికారులు చంద్రబాబుకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబుకు చర్మ సంబంధిత అలర్జీ వచ్చిందని గుర్తించారు. రాజమండ్రి జైలులో ఇందుకు సంబంధించిన వైద్యులు అందుబాటులో లేరు. దీంతో చర్మవ్యాధి నిపుణులను జైలుకు పంపించాలని జైలు అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.

అత్యవసరంగా వైద్యుల్ని పంపించాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన జీజీహెచ్ వైద్యాధికారులు.. ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు కేటాయించారు. అధికారుల ఆదేశం మేరకు గురువారం సాయంత్రం వైద్యులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత చంద్రబాబును వైద్యులు పరీక్షించి, తగిన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్య స్థితిపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. కాగా.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ ఎండలు, ఉక్కపోత కారణంగా చంద్రబాబు కొద్ది రోజులుగా డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. వారం రోజుల నుంచి ఆయన ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు.

జైలులో దీనికి తగ్గ ఏర్పాట్లు లేని కారణంగా ఆయన డీహైడ్రేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబు జైలు వైద్యాధికారుల్ని సంప్రదించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్య స్థితి బాగానే ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చిన అలర్జీ కూడా ఎండ, ఉక్కపోతల కారణంగానే వచ్చి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. చంద్రబాబుకు జైలులో సరైన వసతులు లేవని కొద్ది రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు సరైన వసతులు లేవని, కనీసం వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. బ్యారక్‌లో ఎండతీవ్రత ఎక్కువగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.