Chandrababu Naidu: చంద్రబాబు ఒంటరయ్యారా..? అరెస్టు ద్వారా తేలిందేంటి..?

బీజేపీ పెద్దల నుంచి కూడా బాబు విషయంలో ఆశించిన ఫలితం రాలేదు. బీజేపీ తలుచుకుంటే.. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు కూడా.. బీజేపీ ప్రోద్భలంతోనే బాబును జైలుకు పంపారని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - November 2, 2023 / 12:47 PM IST

Chandrababu Naidu: ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పాడు. బీజేపీ (BJP)కి మద్దతిచ్చి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని నడిపించాడు. ఆ తర్వాత మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలో పెద్ద ఉద్యమమే చేశాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). కానీ పాపం.. ఇప్పుడు ఆయన్ని జాతీయ రాజకీయ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక.. ఇద్దరు, ముగ్గురు నేషనల్ పార్టీ లీడర్లు మాత్రమే స్పందించారు. ఆ తర్వాత ఎవరూ రెస్పాండ్ అవలేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సుప్రీంకోర్టులో కేసు నడిపించేందుకు ఢిల్లీకి వెళ్ళిన లోకేష్ (NARA LOKESH).. అపోజిషన్ పార్టీ లీడర్లను కలుసుకొని మద్దతు కోరతాడని అందరూ అనుకున్నారు. ఇండియా కూటమి నేతలతో భేటీ అవుతాడని టాక్ నడిచింది.

కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా ఏపీలో తన పెద్దమ్మ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన పురంధేశ్వరిని.. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పట్టుకొని.. పెద్ద పైరవీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోగలిగాడు. కానీ, బీజేపీ పెద్దల నుంచి కూడా బాబు విషయంలో ఆశించిన ఫలితం రాలేదు. బీజేపీ తలుచుకుంటే.. చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు కూడా.. బీజేపీ ప్రోద్భలంతోనే బాబును జైలుకు పంపారని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. అయితే లోకేష్.. ఇండియా కూటమిని కలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో మోడీని ఏకిపారేశాడు బాబు. ఇప్పుడు 9 ఏళ్ళుగా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉంది. మరోసారి కూడా వచ్చే ఛాన్సుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అపోజిషన్ మద్దతు కోరితే.. బాబు జైలు నుంచి బయటకు రావడం కష్టమని భావించారు టీడీపీ లీడర్లు. ఇటు ఏపీలో కూడా చంద్రబాబు కుటుంబమే ఒంటరి పోరు చేస్తోంది.

ఎప్పుడూ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని భువనేశ్వరి కూడా ఇప్పుడు బస్సు యాత్రలతో జనంలోకి వెళ్తున్నారు. లోకేష్ ప్రస్తుతానికి పాదయాత్ర ఆపేసినా.. కోర్టుల్లో న్యాయపోరాటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేనతో జత కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ అడపాదడపా ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా ఎక్స్ (ట్విట్టర్‌)లో ట్వీట్స్ చేస్తూనే.. నిరసనల్లోనూ పాల్గొంటున్నారు. అంటే మొత్తం బాబు ఫ్యామిలీ అంతా ఆయన్ని కేసుల నుంచి బయటపడేయడానికి, జనంలో సింపతీని పెంచడానికి ట్రై చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాబు బయట ఉన్నప్పుడు తెగహడావిడి చేసే లీడర్లంతా ఏమైనట్టు..?

ఆయన జైలుకు వెళ్ళినప్పుడు.. ఆరోగ్యకారణాలతో బెయిల్ మీద తిరిగి వచ్చినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు, అభిమానులే స్వచ్ఛంధంగా రోడ్లమీదకు వచ్చారే తప్ప.. నాయకులు భుజాన వేసుకున్న సందర్భం అయితే కనిపించడం లేదు. సో.. ఇప్పుడు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో ఎలా వెళ్ళాలి..? రాష్ట్ర స్థాయిలో లీడర్లను ఎలా దారికి తెచ్చుకోవాలన్నది ఆలోచించాలి. బాబుకు పూర్తిగా బెయిల్ వచ్చి బయటకు వచ్చాక.. పరిస్థితులు ఇంకెంత మారతాయో చూడాలి.