Chandrababu Naidu: కాలమహిమకు సాక్ష్యం నేటి రాజకీయాలే..! తాడే పామై కరుస్తుంది జాగ్రత్త..!

మహానటుడు, తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ మీద వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు. ఇప్పటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారు.

  • Written By:
  • Updated On - September 13, 2023 / 04:46 PM IST

Chandrababu Naidu: బళ్లు.. ఓడలవ్వడం.. ఓడలు బళ్లవడం అనే మాటకు నేటి రాజకీయాలు సరిగ్గా సరిపోతాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన వాళ్లు.. రాజకీయాల్ని శాసించిన వాళ్లు.. ఇప్పుడు ఒంటరిగా, తమను ఆదుకునే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్లు.. ఇప్పుడు అందలం ఎక్కి అన్నీ అనుభవిస్తున్నారు. అందుకే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో దీనికి ఉదాహరణలుగా నిలిచిన కొన్ని సంఘటనలు.
మహానటుడు, తెలుగు ప్రజలు ఆరాధించే ఎన్టీఆర్ మీద వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.
♦ మెగాస్టార్‌గా తిరుగులేని స్థాయి అందుకున్న చిరంజీవి మీద 2009 ఎలక్షన్ ప్రచారంలో కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తరవాత ఆయన రాజకీలయాల నుంచి నిష్క్రమించారు.
♦ మహా మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కోర్టు కేసుల్లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి ఆయన మృతదేహానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
♦ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు.
♦ ఇప్పటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారు.
♦ 1978లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.
♦ తమిళ ప్రజలతో అమ్మ అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సాక్షిగా అవమానం పాలైంది. అసెంబ్లీలో ఆమె చీర లాగి ఇబ్బంది పెట్టారు. అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితిలో చనిపోయిందో చూసాం.
♦ ఆంధ్ర బిల్‌గేట్స్‌గా పేరుపొందిన సత్యం రామలింగరాజు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
♦ ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.
♦ జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
♦ గొప్ప విజన్ ఉన్న నాయకుడుగా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
♦ కేంద్రంలో NDA అధికారంలో ఉన్నప్పుడు, NDA కన్వీనర్ చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన నరేంద్ర మోడీ ఇప్పుడు దేశ ప్రధాని.
♦ సంవత్సరాల క్రితం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ ప్రధానిగా, కెసిఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటే.. చంద్రబాబు పాలనకు 2019 ఎలక్షన్స్‌లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి!
♦ ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటన చూసాం. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి జైలుకు వెళ్లిన మాజీ ముఖ్య మంత్రిగా చూస్తున్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.