KCR-KTR: గులాబీ పార్టీలో ఓటమి భయం..? కేసీఆర్, కేటీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ..

ఓటమి తిప్పలు తప్పేలా లేవు అనుకున్నారో ఏమో.. వెంటనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు వీళ్ల భేటీ సాగింది. రానున్న 10 రోజుల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 01:27 PM IST

KCR-KTR: తెలంగాణలో ఎలక్షన్‌ వార్‌ దాదాపు చివరికి వచ్చింది. మరో పదిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏదో తేలిపోబోతోంది. రెండు టర్ములు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ సారి ఓటమి భయం గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ప్రజల్లో తమపై వ్యతిరేకత ఉందని స్వయంగా రాష్ట్ర అధినాయకత్వమే ఓపెన్‌గా ఒప్పుకుంటోంది. ఎప్పుడూ ప్రజల్లో తిరగని నేతలు కూడా ఇప్పుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ కొత్త హామీలు ఇస్తున్నారు.

KCR on Farmers: అదే స్ట్రాటజీ ! వాళ్ళు ఓట్లేస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా..?

మరోసారి అధికారం ఇస్తే మ్యాజిక్‌ చేసి చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అటు కాంగ్రెస్‌ కూడా అదే స్థాయిలో బలం పెంచుకుంటూ పోతోంది. ఓటమి తిప్పలు తప్పేలా లేవు అనుకున్నారో ఏమో.. వెంటనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు వీళ్ల భేటీ సాగింది. రానున్న 10 రోజుల పాటు బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి కొంత కాలం క్రితం బీఆర్ఎస్‌ పార్టీ కోసం ప్రశాంత కిశోర్‌ పని చేశారు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ పీకే బీఆర్‌ఎస్‌కు దూరయ్యారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్‌తో పీకే భేటీ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం ట్రై చేస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అటూ ఇటూగా ఉంది. దీంతో గెలిచేందుకు అవకాశమున్న ప్రతీ మార్గాన్ని బీఆర్ఎస్‌ పార్టీ ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు మరో పది రోజుల పాటు పాత మిత్రుడు పీకే సారథ్యంలో నడవబోతున్నట్టు తెలుస్తోంది. మరి బీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.