PRAJA DARBHAR: ప్రజాదర్బార్.. పదేళ్ల తర్వాత ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ.. పోటెత్తిన బాధితులు

గతంలో కేసీఆర్ హయాంలో.. ప్రగతి భవన్ అంటే అదేదో శత్రుదుర్భేద్యమైన గడీలాగా ఉండేది. ఎవరికీ అందులో వెళ్ళడానికి అనుమతి లేదు. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పిలిచినప్పుడు మాత్రమే రావాలి. సామాన్య జనాన్ని అయితే అంత దూరం నుంచే పంపించేవారు.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 12:51 PM IST

PRAJA DARBHAR: ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి. ప్రజల సొమ్ముతో కట్టిన ఈ భవనంలోని ఇన్నాళ్ళూ జనానికి ఎంట్రీ లేదు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజాదర్భార్ తో జనానికి స్వాగతం పలికారు. ఇది మీ భవనం.. సీఎం గడీ కాదని చెప్పారు. దాంతో కొత్త సీఎంకు తమ సమస్యలు చెప్పుకోడానికి పొద్దున్నే జనం క్యూలు కట్టారు. రేవంత్ రెడ్డి కూడా జనం దగ్గర అర్జీలు తీసుకొని.. వారి సమస్యలు విన్నారు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే.. అని నెటిజన్లు రేవంత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

KCR fracture : కేసీఆర్ కు తుంటె ఫ్యాక్చర్… ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మేం పాలకులం కాదు.. సేవకులం అంటూ మొదటి ప్రసంగంలో ఆకట్టుకున్నారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టించినం.. దాని పేరు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేశామని ప్రకటించారు. అంతేకాదు.. జనం తమ సమస్యలు చెప్పుకోడానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్భార్ ఏర్పాటు చేస్తుమని చెప్పారు. వాగ్దానం చేసినట్టు ప్రజాదర్భార్ ప్రారంభమైంది. గతంలో కేసీఆర్ హయాంలో.. ప్రగతి భవన్ అంటే అదేదో శత్రుదుర్భేద్యమైన గడీలాగా ఉండేది. ఎవరికీ అందులో వెళ్ళడానికి అనుమతి లేదు. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పిలిచినప్పుడు మాత్రమే రావాలి. సామాన్య జనాన్ని అయితే అంత దూరం నుంచే పంపించేవారు. అందుకే చాలామంది తమ బాధలు చెప్పుకోడానికి వచ్చి.. ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నాలు చేసేవారు. అయినా పాలకులు మనస్సు మాత్రం ఎప్పుడూ కరగలేదు. పోలీసులు కూడా పెద్దసార్లు ఆదేశాలను పాటిస్తూ.. సామాన్యులెవర్నీ ప్రగతి భవన్ దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు.

TS ELECTIONS: తెలంగాణలో ఇక ఎన్నికలే ఎన్నికలు !

పైగా భవన్ ముందు రోడ్లు ఆక్రమించి, భారీగా ముళ్ళకంచలు, అడ్డుగోడలను నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉండేది. అందుకే సీఎంగా రేవంత్ ప్రమాణం చేయక ముందే వాటినన్నింటినీ తొలగించారు. ప్రజాదర్భార్ నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయడానికి దాదాపు 20 మంది దాకా డేటా ఎంట్రీ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి కంప్లయింట్ ను నమోడు చేసి.. ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు చేస్తున్నారు. మళ్ళీ వాటిపై సమీక్ష చేయాలని కూడా నిర్ణయించారు. మొదటి రోజు ఎక్కువగా భూబాధితులే ఉన్నారు. ధరణి సమస్యలను చెప్పుకోడానికి వచ్చామని కొందరు రైతులు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు బాధితులు కూడా ఉన్నారు. జీవో 317 టీచర్ల బదిలీల బాధితులు కూడా ఉన్నారు. బీహార్ గ్యాంగ్ పీడ వదిలిందంటూ కొందరు ప్రజాభవన్ ముందు బ్యానర్లు ప్రదర్శించారు.

ప్రజాభవన్ లో.. ప్రజాదర్భార్ కు వచ్చిన సామాన్యులు, కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులకు మంచినీళ్ళు సమకూర్చారు అధికారులు. అలాగే దివ్యాంగులు ప్రజా భవన్ లోకి వెళ్ళడానికి వీలుగా.. బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సాధించుకున్న పదేళ్ళ తరువాత ప్రజాభవన్ లో సామాన్యులు, మీడియా ప్రతినిధులకు ఎంట్రీ లభించింది.