Etela Rajender: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు.. ఈటలకు మరో చాన్స్‌!

ఈ ఎన్నికల్లో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేశారు. రెండుచోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలవగా.. హుజురాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు.. జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా!

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 02:42 PM IST

Etela Rajender: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. 11 మంది మంత్రులు కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారు అనే హడావుడి ఎలా ఉన్నా.. ఈ సారి ఎన్నికలు మాత్రం తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయ్. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపించాయ్ ఈసారి ఎన్నికల్లో! మంత్రులుగా చేసిన వాళ్లు.. ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న వాళ్లను కూడా ఓటమి పలకరించిది. మిగతా సభ్యుల సంగతి ఎలా ఉన్నా.. ఈటల ఓటమి రాజకీయవర్గాలను షాక్‌కు గురిచేసింది.

Telangana Chief Minister Revanth Reddy : రేవంత్ రెడ్డి.. జడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా..

ఈ ఎన్నికల్లో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ ఈటల పోటీ చేశారు. రెండుచోట్లా ఆయనకు ఓటమే ఎదురైంది. గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలవగా.. హుజురాబాద్‌లో మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి. ఇంత ఘోర పరాభవాన్ని ఈటల వర్గమే కాదు.. జనాలు కూడా ఊహించి ఉండరు బహుశా! ఈటల లేని అసెంబ్లీని ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది అంటూ.. ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రచారం.. ఈటల వర్గానికి మళ్లీ ఆశలు పెంచుతోంది. గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐతే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. ఆయన జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. దీనికోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. పార్లమెంట్‌కు వెళ్లాలని అనుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

ఉపఎన్నికలో పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని వంటేరు ప్రతాప్‌రెడ్డికి సూచించినట్లు కూడా సమాచారం. ఇదే నిజం అయితే.. ఈటలకు మరో చాన్స్ దక్కడం ఖాయం. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌లో రెండో స్థానంలో నిలిచారు ఈటల. ఐతే రెండుచోట్ల ఓడిపోయిన సానుభూతి ఎలాగూ ఉంటుంది. దీనికితోడు తన సొంత సామాజికవర్గ ఓటర్లు బలంగా ఉన్న స్థానం కావడంతో.. గజ్వేల్‌ బరిలో మళ్లీ నిలిస్తే ఈటల విజయం ఖాయం అంటూ కొత్త టాక్ నడుస్తోంది. ఐతే ఇదంతా ప్రచారం మాత్రమే ! కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఉప ఎన్నిక రావాలి.. అప్పుడు మాత్రమే ఈటలకు ఇంకో చాన్స్ దక్కుతుంది. మరి జరుగుతుందా.. ప్రచారంగానే మిగులుతుందా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.