కేఏ పాలా మజాకా ! పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్ట్‌ నోటీసులు

ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు అన్నీ ఆలోచించుకుని ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపించిన తరువాత సొంత లాభం కోసం పార్టీ మారడం అనేది ఎన్నికల వ్యవస్థను హేలన చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.

  • Written By:
  • Publish Date - September 23, 2024 / 05:55 PM IST

ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు అన్నీ ఆలోచించుకుని ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపించిన తరువాత సొంత లాభం కోసం పార్టీ మారడం అనేది ఎన్నికల వ్యవస్థను హేలన చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం ఇలాంటి వాళ్ల పదవులు పోతేనే పార్టీలు ఫిరాయించే కొందరు నాయకుల్లో మార్పు వస్తుంది. ఇదే విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తెలంగాణలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ మీద విచారణ చేపట్టిన హైకోర్టు పది మంది ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిన తరువాత ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా అవసరాన్ని బట్టి పార్టీలు మారితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేంటి అనేది కేఏ పాల్‌ పాయింట్‌. ఈ ఎమ్మెల్యేల్లో కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీఆర్ఎస్‌ పార్టీ కూడా పోరాడుతోంది.

తమ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లిన ఎమ్మెల్యేల సభ్యత్యం రద్దు చేయాలంటూ కేటీఆర్‌ కూడా తెలంగాణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు కేఏ పాల్‌ కూడా పిటిషన్‌ వేయడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో తమ సభ్యత్వం నిజంగానే రద్దువుతుందనే భయం ఎమ్మెల్యేలలో స్టార్ట్‌ అయ్యింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో పాటు 4 వారాలకు విచారణ వాయిదా వేసింది కోర్టు. పార్టీ మార్పుపై ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణను బట్టి తీర్పు వచ్చే అవకాశం ఉంది.