PAWAN KALYAN: జైలులో చంద్రబాబుతో జరిగిన చర్చ ఏంటి..? పొత్తులో జనసేనకు దక్కబోయే సీట్లు ఎన్ని..?

చంద్రబాబును జైలులో పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్.. పొత్తులపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. పవన్ ప్రకటన పొలిటికల్ సర్కిల్‌లో కలకలం రేపుతోంది. వాస్తవానికి దాదాపు ఏడాది కాలంగా రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 04:15 PM IST

PAWAN KALYAN: టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అరెస్ట్ కలిపింది ఇద్దరిని అన్నట్లుగా.. టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన అధికారికంగా బయటకు వినిపించింది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వినిపించాయి. ఐతే అది ఉంటుందా..? ఉండదా..? పొత్తులపై ప్రకటన ఎప్పుడూ..? అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. పొత్తు కుదిరింది సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు.. కాదు కాదు పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు.. పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు.. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కొద్దిరోజులుగా! ఐతే టీడీపీ, జనసేన పార్టీ నేతలు మాత్రం ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొనడం లేదు. అదే సమయంలో విమర్శలు కూడా చేయడం లేదు.

చంద్రబాబు అరెస్టు తర్వాత.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులంతా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును జైలులో పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్.. పొత్తులపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. పవన్ ప్రకటన పొలిటికల్ సర్కిల్‌లో కలకలం రేపుతోంది. వాస్తవానికి దాదాపు ఏడాది కాలంగా రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తోంది. అయితే జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి పదవి పవన్‌కు ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలంటూ సూచనలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రెండు పార్టీల అభిమానుల మధ్య పెద్ద వార్ జరిగింది కూడా..! ఎలాంటి అనుభవం లేకుండా పదవి ఎలా ఇస్తారని టీడీపీ వాదిస్తే.. ఏ పదవి లేకుండానే లోకేశ్‌ను మంత్రి ఎలా చేశారని జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తు పొడవక ముందే మాటల యుద్ధం జరిగింది.

అయితే తాజాగా పవన్ ప్రకటనతో సీట్ల సర్దుబాటు మీద క్లారిటీ, పవర్ షేరింగ్ పైన కూడా ఓ ఒప్పందానికి వచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా కుదిరిన పొత్తుల చర్చల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ మాత్రమే పాల్గొన్నారు. మరి ఆ నలుగురు ఏం చర్చించారు..? పొత్తుల్లో షరతులు ఏమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే! ఇక అటు మొదటి నుంచి టీడీపీని పవన్‌ 40 నుంచి 50 స్థానాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే అదే నంబర్ సీట్లు కేటాయిస్తే.. అది మొదటికే మోసం వస్తుందని.. 20 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారనే ప్రచారం జరిగింది. 20 ఎమ్మెల్యే సీట్లతో పాటు గెలిచిన తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉందనే ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు జైలులో సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చజరిగింది. పవన్‌ను సంతృప్తి పరిచిన సీట్ల నంబర్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.