JANASENA: తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ.. నియోజకవర్గాల ప్రకటన..!

జనసేన తెలంగాణలో పోటీకి సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి ఈ అంశంపై సోమవారం ప్రకటన చేశారు. అయితే, తెలంగాణలో ప్రస్తుతానికి జనసేన ఎవరితో పొత్తులో లేదన్నారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 06:38 PM IST

JANASENA: ఒకవైపు ఏపీలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న జనసేన.. తెలంగాణలో పోటీకి సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి ఈ అంశంపై సోమవారం ప్రకటన చేశారు. అయితే, తెలంగాణలో ప్రస్తుతానికి జనసేన ఎవరితో పొత్తులో లేదని, భవిష్యత్తులో దీనిపై అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారని మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడిచారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు. ”తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణలో పార్టీ అంచెలంచలుగా ఎదుగుతోంది. తెలంగాణాలో పోటీ చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 32 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో పోటీ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. పోటీ చేసే 32 స్థానాల్లో మూడు నెలల క్రితం ఇంచార్జ్‌లను నియమించాం. ఎక్కువగా జీహెచ్ఎంసీ, ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం. తెలంగాణలోను వారాహి యాత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేస్తారు. తెలంగాణలో పొత్తు అనేది ప్రస్తుతానికి లేదు. త్వరలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారు” అని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యమని ఈ సందర్భంగా జనసేన ప్రకటించింది.
జనసేన పోటీ చేయబోయే స్థానాలివే..
1. కూకట్ పల్లి 2. పటాన్ చెరు 3.ఎల్బీ నగర్ 4. సనత్ నగర్ 5. ఉప్పల్ 6. కుత్బుల్లాపూర్ 7. శేరిలింగంపల్లి 8. మల్కాజిగిరి 9. మేడ్చల్ 10. మునుగోడు 11. ఖమ్మం 12. వైరా 13. నాగర్ కర్నూలు 14. కొత్తగూడెం 15.అశ్వరావుపేట 16. పాలకుర్తి 17. నర్సంపేట 18. స్టేషన్ ఘన్ పూర్ 19. హుస్నాబాద్ 20. రామగుండం 21. జగిత్యాల 22. నకిరేకల్ 23. హుజూర్ నగర్ 24. మంథని 25. కోదాడ 26. సత్తుపల్లి 27. వరంగల్ వెస్ట్
28. వరంగల్ ఈస్ట్ 29. ఖానాపూర్ 30. పాలేరు 31. ఇల్లందు 32. మధిర