Jayasudha: పాలిటిక్స్ లోకి జయసుధ రీఎంట్రీ..! ముషీరాబాద్ నుంచి పోటీ..?

ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి జయసుధ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆమె పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తారా.. లేకుంటే ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించకుండా పోతారా.. అనేది చూడాలి.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 04:53 PM IST

సహజ సినీ నటి జయసుధ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఆమె బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటివరకూ మూడు పార్టీలు మారిన ఆమె నాలుగో పార్టీలోకి ఎంటరవబోతున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఆమె బరిలోకి దిగబోతున్నారని టాక్. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే వాళ్లలో కొందరు మాత్రమే ప్రజాభిమానం సంపాదించుకున్నారు. కొందరు మాత్రం కేవలం తమ ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందు ప్రజల ముందుకొస్తారు. అలాంటి వారిలో జయసుధ ఒకరు.

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంలో జయసుధ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె.. 2014లో మళ్లీ పోటీ చేసి ఘోరంగా ఓడిపాయారు. గెలిచిన తర్వాత ఆమె ప్రజల మొహం చూడకపోవడమే కారణం. దీంతో ఆమె వైసీపీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక టీడీపీలో చేరారు. అయితే ఆయా పార్టీల్లో ఎప్పుడూ ఆమె యాక్టివ్ గా పనిచేయలేదు. పార్టీలు ఏవైనా పదవి ఇస్తాయని ఆశించడం మినహా వాళ్లు పార్టీకి, ప్రజలకు ఏమైనా చేద్దామా అని ఆలోచించలేదు. అందుకే ఎక్కడా కుదురుకోలేకపోయారు.

ఇప్పుడు జయసుధ మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జయసుధ భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై వాళ్లిద్దరు చర్చించుకున్నట్టు సమాచారం. వచ్చేనెలలో ఆమె కేంద్ర పెద్దల సమక్షంలో కమలం కండువా కప్పుకోబుతున్నారు. అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి జయసుధ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆమె పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తారా.. లేకుంటే ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించకుండా పోతారా.. అనేది చూడాలి.